హైదరాబాద్, వెలుగు: నిధుల సమీకరణ కోసం విలువైన భూములను అమ్మేందుకు వీలుగా రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి గురువారం హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు. రూ.50 వేల కోట్లు సేకరించేందుకు గాను గ్రేటర్ లోని ఖరీదైన భూములను అమ్మాలని సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. భూములను అమ్మేందుకు సర్కార్ జూన్ 10న జారీ చేసిన జీవో 13, నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయ శాఖ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు, టీఎస్ఐఐడీ, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను పిల్ లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ పై తుది తీర్పు వెలువడే వరకు జీవో, నోటిఫికేషన్ అమలుపై స్టే ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిల్ ను చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించనుంది.