కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ మీ హీరో నే తక్కువ ఇచ్చాడు. లేదు మా హీరోనే ఎక్కువగా ఇచ్చారంటూ అభిమానులు ఒకరినొకరు తిట్టుకున్నారు. అది చివరికి చిలికి చిలికి గాలివానలా మారి హత్యకు దారితీసింది.
రజిని కాంత్, విజయ్ లకు తమిళనాడులేనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆ అభిమానమే విజయ్ అభిమాని ప్రాణం తీసింది.
విజయ్ కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్ కోసం రూ .1.3 కోట్లు కేంద్రానికి, రాష్ట్రానికి విరాళంగా ఇచ్చారు. రజినీ కాంత్ సైతం కరోనా రిలీఫ్ ఫండ్ ను రూ.50లక్షలు అందించారు. నడిగర్ సంగం సభ్యులకు కిరాణా సామాగ్రిని విరాళంగా ఇవ్వనున్నారు.
ఆ విరాళం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు రేపింది. గురువారం (ఏప్రిల్ 23) సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని దినేష్ బాబుతో, విజయ్ అభిమాని యువరాజ్ మరియు అతని స్నేహితులు వాగ్వాదానికి దిగారు. మీ హీరో రిలీఫ్ ఫండ్ తక్కువగా ఇచ్చాడు లేదు మా హీరో రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇచ్చాడంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ బాబు, యువరాజ్ పై దాడి చేశాడు. ఈ దాడిలో యువరాజ్ దుర్మరణం పాలయ్యారు. ఈ హత్యకు సంబంధించి మరకనం పోలీసు అధికారులు దినేష్ బాబును అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు.
