బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు కాకుండా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకే ఇస్తుందని బీజేపీ నేత విక్రమ్ గౌడ్ ఆరోపించారు. నాంపల్లి ఎంజే మార్కెట్ వద్ద తన ఆఫీసులో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ లో మొదటి విడతగా 11,700 మంది పేదలకు డబుల్ ఇండ్లు అందించినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు.
గోషామహల్ లో కేవలం 200 మందికి మాత్రమే డబుల్ ఇండ్లు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అర్హులైన పేదలకు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. గ్రేటర్ లో వెంటనే అర్హులైన పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని లేదంటే బీజేపీ తరఫున పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.