
- మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ప్రవీణ్ కుమార్, సీపీఎం నాయకులు
- 24 గంటలు దాటినా ఇంటికి రాని యువకుడి డెడ్బాడీ
కాగజ్ నగర్, వెలుగు: పెంచికల్పేట్ మండల కేంద్రానికి చెందిన ఫర్టిలైజర్ షాప్ యజమాని కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కృష్ణ వేధింపులతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న అగర్గూడకు చెందిన తుమ్మిడే రాజశేఖర్(22)కు న్యాయం చేయాలని నిందితుడి ఇంటి ముందు గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రెండో రోజు సాగింది. వారికి మాజీ ఎమ్మెల్యే కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న తదితరులు మద్దతు పలికారు. గ్రామస్తులతో కలిసి
ఆందోళనలో పాల్గొన్నారు.
రాజశేఖర్ సోమవారం సాయంత్రం సూసైడ్ చేసుకుంటూ తన మృతికి షాపు యజమానే కారణమని వీడియో చిత్రీకతీశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. మంగళవారం ఉదయం నుంచి గ్రామస్తులు యజమాని ఇంటి ముందు నిరసన చేపట్టారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. రాజశేఖర్ డెడ్బాడీ బుధవారం సాయంత్రానికి కూడా కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంపై నాయకులు మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు తమ అనుచరుడైన కృష్ణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం పూర్తిచేసి రాత్రి రాజశేఖర్ డెడ్బాడీని కుటుంబసభ్యులకు అందజేశామని కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం తెలపడంతో నేతలు ఆందోళన విరమించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్, కౌటాల సీఐలు శ్రీనివాస్ రావు, ముత్యం రమేశ్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తలా రూ.లక్ష సాయం చేసేందుకు నిర్ణయం
బాధిత కుటుంబానికి తమ వంతుగా తలా రూ.లక్ష సాయం చేసేందుకు కోనేరు కోనప్ప, ప్రవీణ్ కుమార్, శ్రీశైలం, సుధాకర్ రావు ప్రకటించారు. నిందితుడు కృష్ణపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసులో కృష్ణ భార్యను సైతం చేర్చాలని డిమాండ్ చేశారు.