సెప్టెంబర్ 18నే వినాయక చవితి.. 28న నిమజ్జనం

సెప్టెంబర్ 18నే వినాయక చవితి.. 28న నిమజ్జనం

బషీర్ బాగ్, వెలుగు :  ఈ నెల 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని, 28న నిమజ్జనం చేయాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పంచాంగకర్తలు, శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు 18వ తేదీనే సూచించారని సమితి గుర్తు చేసింది. ఖైరతాబాద్ వినాయకుడితో పాటు హైదరాబాద్​లో మొత్తం 3 లక్షల విగ్రహాలు ప్రతిష్టించనున్నట్లు వివరించింది. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా నిర్వహించడంపై బుధవారం జీహెచ్​ఎంసీ హెడ్డాఫీస్​లో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మీటింగ్ తర్వాత భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్​రావు మీడియాతో మాట్లాడారు. 


సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులకు తాము కొన్ని సూచనలు చేశామన్నారు. వాటిపై సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. వినాయక చవితిపై ఇప్పటి దాకా క్లారిటీ లేని కారణంగా 18 లేదా 19వ తేదీ జరుపుకోవాలనే గందరగోళంలో భక్తులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది తలెత్తిన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. 

63 అడుగుల విగ్రహం ఏర్పాటు

63 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఖైరతాబాద్​లో ప్రతిష్టిస్తున్నట్లు భగవంత్ రావు తెలిపారు. 28వ తేదీ ఉదయమే ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం ఉంటుందని ప్రకటించారు. చవితికి వారం రోజుల ముందే రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చి వేస్తామని జీహెచ్​ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ హామీ ఇచ్చారని వివరించారు. నిమజ్జనం తర్వాత విగ్రహాలను గౌరవప్రదంగా తొలగించాలని కోరారు. 

అన్ని ఏర్పాట్లు చేస్తాం: విజయలక్ష్మి, మేయర్

గణేష్‌‌‌‌ నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని జీహెచ్​ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. పబ్లిక్ టాయిలెట్లు, మొబైల్ ట్రీ కటింగ్ మిషన్​లు, హెల్త్ క్యాంప్​లు, బోట్లు, గజ ఈతగాళ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు, ఫైరింజన్లు, తాగునీటి సరఫరా వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

ఈ ఏడాది స్టాటిస్టిక్స్ మొబైల్ క్రేన్ల సంఖ్య కూడా పెంచుతామని ప్రకటించారు. సిటీలో 3.10 లక్షల మట్టి విగ్రహాలు ఫ్రీగా పంపిణీ చేయాలని జీహెచ్​ఎంసీ నిర్ణయించిందని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్‌‌‌‌ఎంసీ డిప్యూటీ మేయర్‌‌‌‌ శ్రీలత శోభన్‌‌‌‌ రెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్‌‌‌‌ గణేష్‌‌‌‌ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.