జిమ్లో తన భర్తతో కలిసి వర్కౌట్స్ చేసే ఓ యువతిపై భార్యకు అనుమానం వచ్చింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న డౌట్తో నేరుగా జిమ్కు వచ్చి ఇద్దరినీ చెప్పుతో కొట్టింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కొహెఫిజా ఏరియాలో అక్టోబర్ 15న ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న వాళ్లు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారింది.
భోపాల్కు చెందిన ఓ 30 ఏండ్ల మహిళకు తన భర్త జిమ్లో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం కలిగింది. దీంతో తన చెల్లెలితో కలిసి గత శుక్రవారం నాడు ఆ మహిళ భర్త వెళ్లే జిమ్కు పోయింది. ఆమె అక్కడికి వెళ్లే సమయానికి అక్కడ తన భర్తతో పాటు అతడి గాళ్ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంది. దీంతో ఆ మహిళ తన భర్తతో వాగ్వాదానికి దిగింది. పక్కనే ఆ యువతి ఉండడంతో ఆమె తన చెప్పులు తీసి కొట్టింది. భర్తతో పాటు అక్కడున్న వాళ్లు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేసినా.. విడిపించుకుని మరీ ఆ యువతిని జుట్టపట్టుకుని కొడుతూనే ఉంది. దాదాపు పది నిమిషాల పాటు ఆ ముగ్గురి కొట్లాట నడిచింది. అయితే అసలు ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదని, ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదని భర్త చెబుతున్నా ఆమె వినిపించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై భార్యాభర్తలిద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇద్దరిపైనా కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నామని కొహెఫిజా ఏరియా పోలీస్ స్టేషన్ అధికారి అనీల్ బాజ్పాయ్ చెప్పారు. అయితే ఆ మహిళ ఇప్పటికే తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిందని, కొద్ది రోజులుగా ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉంటోందని పోలీసులు వివరించారు.