విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ గైర్హాజరీ తమ టీమ్కు అదనపు ప్రయోజనం చేకూరుస్తుందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. పితృత్వ సెలవులతో కోహ్లీ, గాయంతో షమీ చివరి మూడు మ్యాచ్లకు దూరమయ్యారు. విరాట్, షమీ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు దూరమవ్వడం పర్యాటక భారత్ను బలహీనంగా మార్చాయని లాంగర్ చెప్పాడు. అడిలైడ్లో ఓటమి, ఈ ఇద్దరు ప్లేయర్లు దూరమవ్వడంతో టీమిండియా పై ఒత్తిడి పెంచుతుందని.. ఫైట్బ్యాక్ చేయాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాలన్నాడు.
‘విరాట్ ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకడు. షమీ టీమిండియా బౌలింగ్ అటాక్కు వెన్నెముక లాంటి వాడు. అతడిలో చాలా ప్రతిభ ఉంది. ఇలాంటి ప్లేయర్లు లేకపోవడం భారత్ను దెబ్బతీస్తుంది, మాకు కలిసొస్తుంది. అయినా మేం మా గేమ్ప్లాన్ను పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. తొలి రోజు ఆటను బాగా ఆరంభించాలి. రహానె భారత కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటే అతడిపై మేం ప్రెజర్ పెంచుతాం’ అని లాంగర్ పేర్కొన్నాడు.

