- పర్యావరణ పరిరక్షణలో విశాక ఇండస్ట్రీస్ ఎంపిక
- అవార్డ్ అందుకున్న విశాక ఇండస్ట్రీస్ బిజినెస్ హెడ్ సునీల్
న్యూఢిల్లీ, వెలుగు : విశాక ఇండస్ట్రీస్కు చెందిన ఆటమ్ (ఏటీయూఎం) సోలార్ రూఫ్కి ప్రతిష్టాత్మకమైన ‘‘ది గీఫ్ గ్లోబల్ అవార్డ్’’ వరించింది. ప్లాటినం కేటగిరీలో సస్టైనబిలిటీ ఛాంపియన్ అవార్డ్2024 దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హోటల్లో ది గ్లోబల్ ఎంగేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఫోరం(జీఈఈఎఫ్) ఆధ్వర్యంలో గ్లోబల్ క్లీన్ ఎనర్జీ సమిట్ 2024 జరిగింది. ఈ కార్యక్రమంలో కంపెనీలకు పలు విభాగాల్లో గీఫ్ సంస్థ గ్లోబల్ అవార్డ్స్ను అందజేసింది. ఇందులో ‘ఆటమ్ సోలార్ రూఫ్’కి అవార్డు వచ్చింది.
ఈ అవార్డును సంస్థ తరఫున బిజినెస్ హెడ్ సునీల్, ముఖేశ్, పంకజ్ అందుకున్నారు. అనంతరం సంస్థ బిజినెస్ హెడ్ సునీల్ మాట్లాడుతూ.. సోలార్ రంగంలో ప్రతిష్టాత్మకమైన గీఫ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో దేశవ్యాప్తంగా పలు సోలార్ కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులపై ది గీఫ్ సంస్థ సర్వే నిర్వహించిందన్నారు. ఇందులో ఆటమ్ సోలార్ రూఫ్కి చెందిన రెండు ప్రాజెక్టులను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇందులో హర్యానాలోని జజ్జర్, కోయంబత్తూరులోని ఉడ్మల్పేట్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు.
ఆటమ్ సోలార్ రూఫ్ను ఇంటి పై కప్పుగానే కాకుండా సోలార్ ఉత్పత్తికీ వాడుకోవచ్చన్నారు. దీని ద్వారా అదనంగా 30 శాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రాడెక్ట్ను ఇండస్ట్రీస్, రెసిడెన్షియల్, కార్పొరేట్ సహా అన్ని సెక్టార్లలో విరివిగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు ఆటమ్ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ రూఫ్ వినియోగంతో చెట్ల నరికివేత తగ్గించడం, గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని కంట్రోల్కి తేవచ్చని పేర్కొన్నారు.