ముషీరాబాద్,వెలుగు: అన్నిరంగాల్లో మహిళలు ఒకరికొకరు సహకరించుకుంటూ విజయాలు సాధించాలని విశాక ఇండస్ట్రీస్ ఎండీ, కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ కరస్పాండెంట్ గడ్డం సరోజ వివేక్ ఆకాంక్షించారు. పూర్వకాలంలో యువతులు, మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని, చాలా కండిషన్స్ పెట్టేవారిని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబాల్లో మహిళలను ప్రోత్సహించడం మొదలైందని పేర్కొన్నారు.
మహిళా శక్తి సమ్మేళనం బర్కత్ పురా ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూషన్ లో భాగ్యనగర్ విభాగ్ తెలంగాణ ప్రాంత సమ్మేళనం జరిగింది. సరోజ వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు సజావుగా నడుస్తుందనేది వాస్తవమని, మహిళలు ఏ రంగంలోనైనా సరే ముందుకు వస్తే కుటుంబంతో పాటు రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయన్నారు. భారత సంస్కృతిలో మహిళల పట్ల ఎంతో గౌరవం ఉంటుందని నైనా జైస్వాల్ పేర్కొన్నారు.
క్రీడల్లో సత్తా చాటేలా ప్రోత్సహిస్తాం
టాలెంట్ఉన్న పేద విద్యార్థులు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటే విధంగా ప్రోత్సహిస్తున్నామని సరోజ వివేక్ పేర్కొన్నారు. కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం స్పాట్ లైట్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎడ్యుకేషన్ లో అండర్ – 11స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతగా నిలిచిన స్పాట్ లైట్ క్రికెట్ అకాడమీ జట్టుకు సరోజ వివేక్ ట్రోఫీని ప్రదానం చేసి మాట్లాడారు.