విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. మార్చి 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ‘ప్రతి మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటితో పాటు ప్రస్తుత సమాజంలో జరిగే పరిస్థితులను, పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందనేది సందేశాత్మకంగా చూపించాం.
అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని టైటిల్ పెట్టాం. ఇందులో అన్ని క్యారెక్టర్లకు రెండు షేడ్స్ ఉంటాయి. నా పాత్రకు అవసరమైన కోపం, యాంగ్జైటీ లాంటి ఎమోషన్స్ కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. ఇందులో థ్రిల్లర్, సస్పెన్స్తో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది.
ప్రతి రెండు మూడు సీన్లకు ఓ కొత్త జానర్ అనిపిస్తుంది. నా పాత్రతో పాటు ఆయుషి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. చిత్రా శుక్లా కీలక పాత్రలో కనిపిస్తారు. అన్నపూర్ణ సంస్థ రిలీజ్ చేస్తుండటం హ్యాపీ. ప్రస్తుతం మంత్ర, తంత్రాల నేపథ్యంలో ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్ చేస్తున్నా’ అని చెప్పాడు.