డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో హీరోగానే కాక దర్శకుడిగానూ తన మార్క్ చూపిస్తోన్న విశ్వక్ సేన్, త్వరలో ‘ధమ్కీ’ సినిమాతో రాబోతున్నాడు. ‘ఫలక్ నుమా దాస్’ తర్వాత అతను డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ను బాలకృష్ణ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ధమ్కీ ట్రైలర్ అద్భుతంగా, కన్నులవిందుగా ఉంది. విశ్వక్ సేన్ అద్భుతమైన స్టెప్పులు వేశాడు. తనకి సినిమాలంటే పిచ్చి. ఇది చూస్తే తన ప్యాషన్ తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు చూస్తే.. నన్ను నేను ఊహించుకుంటాను (నవ్వుతూ). ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విశ్వక్ తీస్తోన్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగానూ ప్రూవ్ చేసుకుంటున్న తనకి నా అభినందనలు’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన బాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. వన్ పర్సెంట్ కూడా కాంప్రమైజ్ కాకుండా తీసిన సినిమా ఇది. సంవత్సరం నుండి ఏ సినిమా చేయకుండా దీన్నే నమ్మి తీశాం. అందరికీ చాలా బాగా నచ్చుతుంది’ అని చెప్పాడు. నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ ‘ఫలక్నుమా దాస్ తర్వాత మా ప్రొడక్షన్లో వస్తోన్న రెండో సినిమా ఇది. దీని కోసం విశ్వక్ నాలుగు సినిమాల కష్టం పడ్డాడు. అదంతా స్ర్కీన్పై కనిపిస్తుంది. ప్రేక్షకులు సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా’ అన్నారు. రైటర్ ప్రసన్నకుమార్, లిరిసిస్ట్ పూర్ణాచారి, కొరియోగ్రాఫర్ యశ్, ఎడిటర్ అన్వర్ పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుంది.
‘నేను కూడా ఓ సినిమా డైరెక్ట్ చేద్దామనుకుని ‘నర్తనశాల’ మొదలుపెట్టాను. కానీ పూర్తవలేదు. ఆ తర్వాత టైమ్ లేక, సబ్జెక్ట్స్ తట్టక డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. వచ్చే సంవత్సరం ‘ఆదిత్య 999’ ఉంటుంది’
- బాలకృష్ణ