మంత్రికి సైదిరెడ్డి బినామీ..గెలిపిస్తే అరాచకమే

మంత్రికి సైదిరెడ్డి బినామీ..గెలిపిస్తే అరాచకమే
  •     ఆయన్ను గెలిపిస్తే అరాచకమే
  •     బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి

పాలకీడు, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డి బినామీ.. ఆయన్ను గెలిపిస్తే హుజూర్‌నగర్‌లో అరాచకం పెరిగిపోతుందని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆయన సమక్షంలో మండలంలోని సింగారం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ సైదులు సహా 30 మంది టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వీరిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సింగారం, రావిపాడు దేవ్లాతండా, కల్మెట్ తండ, డెక్కన్ కాలనీ గ్రామాల్లో పార్టీ అభ్యర్థి కోట రామారావు గెలుపుపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో దోచుకుందని ఆరోపించారు. ఆ డబ్బునే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందన్నారు. అవినీతి సొమ్ముతో  గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. మాటల గారడితో ప్రజలను మాయ చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలంటే బీజేపీ పార్టీకి ఓటు వేయాలన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు కొత్తూరు వెంకటేశ్వర్లు, శేషగిరిరావు, సురేష్ తదితరులు ఉన్నారు.