కష్టపడ్డ కాంగ్రెస్ శ్రేణులందరికీ ధన్యవాదాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలలుగా జూబ్లీహిల్స్ లో తనతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, డివిజన్ నాయకులు, బూత్ ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు చాలా కష్టపడ్డారని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చామన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నవారు అభివృద్ధి పనులు చేయలేదని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఆశీర్వదించారన్నారు. గతంలో కేటీఆర్.. ‘‘సారు.. కారు..16’’ అన్న మాటలకు 2023 లో ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ, ప్రత్యేకంగా షేక్ పేట్ డివిజన్ ఓటర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
