
హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో G. వెంకటస్వామి ఫౌండేషన్ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ‘సెక్రటేరియట్ కూల్చివేత – కొత్త అసెంబ్లీ నిర్మాణం’పై నాయకులు మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. మాజీ ఎంపీ వివేక్ వెకటస్వామి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఇతరులు పాల్గొన్నారు.
సెక్రటేరియట్ కూల్చివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కొత్తవి కట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు లెటర్ ఇచ్చామన్నారు. సెక్రటేరియట్ కూల్చవద్దని కోర్ట్ లోకూడా చాలా మంది పిటిషన్లు వేస్తున్నారనీ.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు. ఈనెల 25వ తేదీన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నామన్నారు. చలో సెక్రటేరియట్ లో నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీలు,కుల సంఘాలు, యువత పాల్గొనాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసమే చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడకు పోయినా సెక్రటేరియట్ కూల్చివేత మీదనే చర్చ జరుగుతోందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడు సెక్రటేరియట్ కట్టుకోవచ్చు కానీ.. బాగా నడుస్తున్న సెక్రటేరియట్ బిల్డింగులను కూల్చి మళ్ళీ కొత్తవి కట్టడం ఎందుకని ప్రశ్నించారు.
తెలంగాణపై రూ.లక్ష 65వేల కోట్ల అప్పు ఉందని పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా చెప్పారన్నారు వివేక్ వెంకటస్వామి. అప్పు చేసి కొత్తవి కట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అప్పులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.