తెలంగాణ కోసం పోరాడటమే నేను చేసిన ద్రోహమా? : వివేక్

తెలంగాణ కోసం పోరాడటమే నేను చేసిన ద్రోహమా? : వివేక్
  • పథకం ప్రకారం నా ప్రజలకు నన్ను దూరం చేసేలా ప్రయత్నం  జరిగింది
  • టీఆర్ఎస్ చేసిన ద్రోహం దిగ్భ్రాంతి కలిగిస్తోంది
  • TRS బలహీనంగా ఉన్నచోట పటిష్టపరిచేందుకు కృషిచేశా
  • టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలున్నప్పుడు బిల్లుకోసం మేమంతా జాతీయ పార్టీలపై ఒత్తిడితెచ్చాం
  • ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఉద్యమవీరులను పక్కనపెట్టారు
  • జై తెలంగాణ అని నోరెత్తి అననివాళ్లకు కూడా టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది
  • నియంతృత్వ పోకడలను జనంపై రుద్దుతున్నారు
  • సమయం తక్కువగా ఉండటంతో పోటీలో నిలబడటం లేదు

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తనపై వచ్చిన రాజకీయ విమర్శలను తిప్పికొడుతూ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఆటబొమ్మలు కొందరు తనపై తప్పుడు ఆరోపణలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రసాధనే లక్ష్యంగా తెలంగాణ కోసం తన తండ్రి కాకా, తాను రాజీలేని పోరాటం చేశామని చెప్పారు. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ ఆహ్వానిస్తేనే టీఆర్ఎస్ లోకి వచ్చానని చెప్పారు. తెలంగాణ బాగు కోసం పనిచేయడం… ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడటమే పార్టీకి ద్రోహం చేసినట్టుగా భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నచోట పటిష్టం చేయడానికి కృషి చేయడమే తాను చేసిన ద్రోహమా? అని అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని బట్టే… ఎవరు ద్రోహం చేశారో తెలిపోయింది అని చెప్పారు వివేక్ వెంకటస్వామి. టికెట్ హామీ ఇచ్చి కూడా తనను పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కేసీఆర్ తొత్తులు కొందరు పనిచేశారని అన్నారు. ఓ పథకం ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీలో లేకుండా చేసేందుకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  చివరిక్షణంలో టికెట్ నిరాకరించారని అన్నారు వివేక్.

2014లో టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీలే ఉంటే…. తాను తోటి ఎంపీలతో కలిసి బిల్లు ఆమోదం కోసం జాతీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చానన్నారు. ఢిల్లీ స్థాయిలో తాను సాగించిన పోరాటమే పార్టీకి చేసిన ద్రోహమా? అని అన్నారు వివేక్ వెంకటస్వామి.

ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు తీసుకోకపోగా, ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పిన వివేక్ వెంకటస్వామి.. అదే తాను చేసిన ద్రోహం కావచ్చని అన్నారు.

సొంత ప్రజలకు తనను దూరం చేయడానికి చేసిన ఈ ద్రోహం దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో ఏ పాత్ర పోషించని వాళ్లకు, కనీసం జై తెలంగాణ అని నినాదం కూడా చేయనివాళ్లకు టికెట్లిచ్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా.. ఉద్యమకారులను పక్కనబెట్టారని అన్నారు. తెలంగాణకు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినవాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ కు పెద్ద ముఖాలుగా ఉండడం బాధిస్తోందని చెప్పారు.  ప్రజాస్వామిక తెలంగాణ సాధించాలన్న ఆశయం నెరవేరకపోగా నియంతృత్వపోకడలను ప్రజల మీద రుద్ధుతున్నారనీ…. ఈ విషయాన్ని జనం త్వరలోనే గుర్తిస్తారని వివరించారు వివేక్.

రాష్ట్రమంతటా ఉన్న అభిమానులు, మద్దతుదారులు తనను పోటీ చేయాలని కోరుతున్నా కూడా.. సమయం తక్కువగా ఉండడం వల్ల ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని స్పష్టంచేశారు వివేక్. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానంటూ… కష్టకాలంలో తోడున్న మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.