
మంచిర్యాల, వెలుగు: అవినీతి, నియంతృత్వ, అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కారును ఇక భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్కో హఠావో, కాంగ్రెస్కో జితావో, తెలంగాణకో బచావో’ పేరుతో చేపట్టిన తెలంగాణ ప్రజా సంఘాల జన చైతన్య యాత్ర మంచిర్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి నివాసంలో మీడియాతో రవీందర్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మాయమాటలతో గారడీ చేస్తూ ప్రజలను భ్రమల్లోకి నెట్టేశారని, ఉద్యోగాలు రాక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కాయన్నారు. రైతు బంధు పేరుతో రైతుల హక్కులన్నీ కాలరాశారని, ఇన్పుట్ సబ్సిడీ, అవుట్ సబ్సిడీ తీసేశారని, ఎరువుల ధరలు పెంచారని ఫైర్ అయ్యారు. రైతు కొడుక్కు ఉద్యోగం ఇవ్వరు కానీ రైతు చనిపోతే బీమా ఇస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని, తొమ్మిదిన్నరేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో కేసీఆర్ సర్కారు పతనం ఖాయమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అందుకే కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న కాంగ్రెస్కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.