
హైదరాబాద్: బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్తో భేటీ అనంతరం వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్ కింగ్ ఈ విషయం తెలిపారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ పెట్టుబడుల కేంద్రంగా ఎలా మారిందో ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి ఉండటం వల్ల తెలంగాణ.. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తోందని అన్నారు.
1998లో ఏర్పాటైన వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్కు ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరేబియన్లోని 42కిపైగా నగరాల్లో 40 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది ప్రముఖ బ్రాండ్లకు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సొల్యూషన్స్ను అందిస్తోంది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.