
- నిన్న ఫాంహౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ
- ఇవాళ ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం టూర్ రద్దు
- సోషల్ మీడియాలో టీమ్ కేటీఆర్ Vs టీమ్ కవితక్క
- మహిళా నేతలను కట్టడి చేస్తున్న కేటీఆర్!
- వచ్చి కేటీఆర్ తో ఫొటోలు దిగుతూ
- వుయ్ ఆర్ విత్ కేసీఆర్ అని పోస్టింగ్స్
- ఏకంగా కవితపై విమర్శలు చేస్తున్న మరికొందరు
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. కవిత స్వయంగా కేసీఆర్ కు రాసిన లేఖ బయటికి రావడం, ఆ లేఖపై ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని చెప్పడం తెలిసిందే. ఇదే తరుణంలో మరుసటి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని కామెంట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ లో దయ్యాలెవరు..? కోవర్టులెవరన్న చర్చ సాగింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇవాళ ఉదయం ఆమె భారీ ర్యాలీగా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు. ఆయనతో రెండు గంటలపాటు చర్చించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సిన అంశాలపైనే చర్చించినట్టు బయటికి సమాచారం వచ్చింది. అయితే ఈ సందర్భంగా కుటుంబ పరిస్థితులపైనా చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కవిత కామెంట్స్ పై ఏమీ మాట్లాడవద్దని కేటీఆర్ కు గులాబీ బాస్ సూచించారని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్, కేసీఆర్ మీటింగ్ తర్వాత కవిత ఆఫీసు నుంచి ఓ సమాచారం వచ్చింది. అదే మిటంటే ఆమె తన కాళేశ్వరం టూర్ రద్దు చేసుకున్నారు. కవిత కేసీఆర్ సూచన మేరకే కాళేశ్వరం టూర్ రద్దు చేసుకున్నారా..? అనే చర్చ మొదలైంది. అప్పటి వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ కవితకు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి. ముఖ్యంగా మహిళా నేతలతోనే పోస్టింగ్స్ పెట్టించారు. ఆ పోస్టుల్లో కవితపై విమర్శలు చేయించారనే టాక్ ఉంది. దీనికి కవిత టీమ్ కూడా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యింది. ఆ పోస్టింగులకు దీటైన జవాబు ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా అన్నా చెళ్లెళ్ల గ్రూపుల మధ్య యుద్ధమే జరుగుతోంది.
కవితకు అపాయింట్ మెంట్ లేదా?
పార్టీ బాగు కోసమే వ్యాఖ్యలు చేశానని కవిత కామెంట్ చేశారు. ఆమె అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు కేసీఆర్ ను కవిత కలవలేదు. ఆమెకు అపాయింట్ మెంట్ దొరకడం లేదా..? లేకా కావాలనే వెళ్లడం లేదా..? అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఆ తర్వాత కవిత మీడియా ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కవిత ఇవాళ్టి కాళేశ్వరం టూర్ రద్దుపై రెండు మూడు రకాల చర్చలు జరుగుతున్నాయి. పుష్కరాల చివరి రోజు కావడంతో ట్రాఫిక్ రద్దీ కారణంగా వెళ్లడం లేదని, మరొకటి కేసీఆర్ సూచన మేరకే ఆమె కాళేశ్వరం పర్యటన రద్దు చేసుకున్నారనే వాదన ఉంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. పార్టీలో దయ్యాలున్నాయని కవిత విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా కేటీఆర్ తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని బదులిచ్చారు. దీనిపై మీడియాలో మాట్లాడాల్సి ఉంటుంది. బయటికి వస్తే వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే మీడియాకు దూరంగా ఉంటున్నారనే మరో ప్రచారం ఉంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో ఏం జరుగబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. **