గ్రేటర్ వరంగల్/ ఖిలావరంగల్(మామునూర్), వెలుగు: జంతు హింసను అరికట్టాలని వరంగల్ కలెక్టర్, జిల్లా జంతు హింస నివారణ సంఘం చైర్పర్సన్ సత్యశారద అన్నారు. జంతు సంక్షేమ పక్షత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్లో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ ఆర్థిక సహకారంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు చెప్పారు.
జిల్లాలోని గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి నివారణకు 1,33,236 టీకాలు, 13 గ్రామాల్లో ఆడ, పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ప్రత్యేక చికిత్సా శిబిరాలు నిర్వహించి 947 పశువులకు వైద్య సేవలు అందించామని వివరించారు. అదేవిధంగా కుక్కలకు యాంటీ-రేబిస్ టీకాలు కూడా వేయించినట్లు చెప్పారు. కాగా, జంతు సంక్షేమ పక్షోత్సవ ర్యాలీని మామునూరులోని పీవీ నర్సింహారావు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
స్కూల్స్, కాలేజీలకు సెలవు
మేడారం మహాజాతర సందర్భంగా నేడు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14న పనిదినంగా పరిగణించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
