వరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు

వరంగల్ ప్రేమ వ్యవహారంలో.. ఇండ్లకు నిప్పు పెట్టిన 11 మంది అరెస్టు
  • గొడ్డళ్లు, వేట కొడవళ్లు, కర్రలు, డీజిల్​డబ్బాలు స్వాధీనం
  • ఐదు బైక్​లు, పది సెల్ ఫోన్లు సీజ్​ 

హనుమకొండ/నర్సంపేట, వెలుగు: కూతురు ప్రేమ పెండ్లి చేసుకుందనే కోపంతో కుటుంబసభ్యులు, బంధువులు..అందుకు కారణమైన యువకుడితో పాటు స్నేహితుల ఇండ్లకు నిప్పు పెట్టగా...ఈ కేసులో అమ్మాయి తండ్రితో పాటు మరో 11 మందిని నర్సంపేట పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి  రెండు గొడ్డళ్లు,  మూడు వేటకొడవళ్లు,  కర్రలు, డీజిల్ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు బైకులు​, పది సెల్​ఫోన్లు సీజ్​చేశారు. వరంగల్ ఈస్ట్​జోన్​ డీసీపీ కరుణాకర్​కమిషనరేట్​ ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాలులో వివరాలు తెలియజేశారు.

ALSO READ :అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్​ సర్కారు

 వరంగల్​జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి సర్పంచ్​మండల రవీందర్ బిడ్డ కావ్య బీటెక్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జాలిగం రంజిత్ తో ప్రేమలో పడి గత నెల 30న ఓ టెంపుల్​లో పెండ్లి చేసుకున్నారు. ఇది జీర్ణించుకోలేని ఆమె తండ్రి, గ్రామ సర్పంచ్​అయిన మండల రవీందర్..బంధువులైన మండల రాజమౌళి, మండల శ్రీను, మండల రమేశ్, మండల పైడి, మండల సదయ్య, మండలరాజు, మండల శివ, గడ్డల విష్ణు, మండల రాజు, మండల సదయ్యలతో కలిసి కక్ష తీర్చుకోవాలని అనుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి అందరూ కలిసి రంజిత్ ఇంటితో పాటు సహకరించారనే అనుమానంతో అతడి  స్నేహితుల ఇండ్లపై దాడులు చేసి తగులబెట్టారు. బాధితులు నర్సంపేట పీఎస్​లో ఫిర్యాదు చేయగా బుధవారం నర్సంపేట శివారు  ఖానాపూర్ వెళ్లే రూట్​లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నర్సంపేట ఏసీపీ సంపత్​రావు,  సీఐ రమేశ్, ఇతర పోలీస్ సిబ్బందిని డీసీపీ కరుణాకర్​  అభినందించారు.