తాళం వేసిన ఫ్లాట్లలో .. 8 నిమిషాల్లోనే చోరీ చేస్తరు!

తాళం వేసిన ఫ్లాట్లలో ..  8 నిమిషాల్లోనే చోరీ చేస్తరు!
  • వాకీటాకీలు, లేటెస్ట్​ కట్టర్లతో ఘజియాబాద్ గ్యాంగ్ దొంగతనాలు
  • పట్టుకున్న వరంగల్​ పోలీసులు
  • 2.38 కిలోల గోల్డ్, డైమండ్​ చైన్లు స్వాధీనం 
  • వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్​


వరంగల్, ఆదిలాబాద్​, బెంగళూర్ ​తదితర ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న గజియాబాద్ గ్యాంగ్​ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల విలువైన 2.38 కిలో ల బంగారం, వజ్రాల నెక్లెస్​లు, 104 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్, ఐదు బుల్లెట్లు, కారు, సెల్​ఫోన్లు, వాకీటాకీలు, నకిలీ ఆధార్​ కార్డులు, ఐదు వేల నగదు సీజ్​ చేశారు. వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్​ బుధవారం కమిషనరేట్ ​కాన్ఫరెన్స్ హాల్​లో వివరాలు వెల్లడించారు. యూపీలోని గజియాబాద్​ కు చెందిన మహమ్మద్ ​షరీఫ్​, ఇతడి కొడుకు షహజాద్​ఖాన్​, మరో వ్యక్తి అక్బర్​ఖురేషీ, మీరట్​కు చెందిన కపిల్​జాటోవు ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవారు. తాళం వేసి ఉన్న ఫ్లాట్లను టార్గెట్​ చేసేవారు. టెక్నీషియన్​లా లోపలకు వెళ్లేవారు. బయట కారులో ఇద్దరు కూర్చునేవారు. వాకీటాకీల ద్వారా సమాచారం చేరవేసుకునేవారు. తాళం వేసిన ఫ్లాట్లలో కేవలం 8 నుంచి 10 నిమిషాల్లోనే అధునాతన కట్టర్లతో చోరీ పూర్తి చేసేవారు. 

ఇలా చోరీలు చేసి ఢిల్లీలో కారు కొన్నారు. ఈ నెల 4న ఆదిలాబాద్​ వచ్చారు. అక్కడ రెండు ఇండ్లల్లో చోరీ చేసి, మరునాడు వరంగల్​చేరుకున్నారు. పోలీసులంతా క్రైమ్​మీటింగ్​లో ఉండగా హనుమకొండ, సుబేదారి, మట్వాడా పీఎస్​ల పరిధిలోని అపార్ట్​మెంట్లలో 8 చోరీలు చేశారు. వరంగల్ వద్దిరాజు అపార్ట్​మెంట్​లోకి వెళ్తండగా వాచ్​మెన్ ప్రశ్నించడంతో పిస్టల్​తో బెదిరించి పరారయ్యారు. కారు నంబర్​ ప్లేట్​ మార్చుకుని ఏపీలోకి ఎంటరయ్యారు. బాధితుల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఏడాది మేలో కర్నూలులో కూడా ఇలాగే చోరీలు చేసి పట్టుబడ్డట్టు గుర్తించారు. అక్కడి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈక్రమంలో నిందితులు ములుగు ప్రాంతంలో 104 కిలోల గంజాయిని కొని వరంగల్ వచ్చారు. 

ALSO READ: పరిహారం తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో రైతు ఆత్మహత్య

సుబేదారి స్టేషన్​ పరిధిలోని తెలంగాణ జంక్షన్​ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ ముఠాకు ఢిల్లీ పోలీసుల సహకారం ఉన్నట్లు తెలిసిందని, టెక్నికల్​గా భారీ నెట్​వర్క్​కూడా ఉందని సీపీ చెప్పారు. 32 చోరీలు చేశారన్నారు.  ప్రతిభ చూపిన వరంగల్ క్రైమ్స్​డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీ మల్లయ్య, మట్వాడా, మహిళా పీఎస్​, సీసీఎస్​, హనుమకొండ, సుబేదారి సీఐలు వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్​, శంకర్​నాయక్​, కరుణాకర్​, షుకూర్​, కర్నూర్​ సీఐ శంకరయ్యలను సీపీ అభినందించారు.