మాకు లీడర్లు నచ్చలే.. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో నోటాకు 44 వేల ఓట్లు

మాకు లీడర్లు నచ్చలే.. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో నోటాకు 44 వేల ఓట్లు
  • కొన్ని చోట్ల ప్రధాన పార్టీల తర్వాతి స్థానం నోటాదే
  • ఎల్​బీనగర్ లో 45 మందిని వెనక్కి నెట్టి.. 4వ స్థానానికి

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నోటా ప్రాధాన్యం తగ్గడం లేదు. గ్రేటర్​హైదరాబాద్​పరిధిలోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్​ఎస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీల తర్వాతి స్థానంలో నోటా నిలిచింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో నోటాకు15,418 ఓట్లు రాగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో12,824 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్​ జిల్లాలో 16,222 ఓట్లు నోటాకు పడ్డాయి. సెగ్మెంట్ల పరంగా చూస్తే... కుత్బుల్లాపూర్లో అత్యధికంగా నోటాకు 4,079 ఓట్లు రాగా, అత్యల్పంగా నాంపల్లిలో 544 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి గ్రేటర్ లో నోటాకు ఓట్లు కొంత తగ్గినా.. ఉనికి మాత్రం చాటింది. గతంలో పోలిస్తే 471 ఓట్లు తగ్గాయి. నోటాకు కొన్ని చోట్ల వేలల్లో ఓట్లు వచ్చాయి. మేడ్చల్​లో 3,737 ఓట్లు, శేరిలింగంపల్లిలో 3,145, ఎల్​బీనగర్​లో 2,966, మల్కాజ్ గిరిలో 2,608,  కూకట్​పల్లిలో 2,458, ఉప్పల్​లో 2,536, మహేశ్వరంలో 2,031 ఓట్లు నోటాకు వచ్చాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేలలోపు నోటాకు పడిన సెగ్మెంట్లు 10 ఉండగా, ఐదొందల నుంచి వేయిలోపు పడిన సెగ్మెంట్లు 6  ఉన్నాయి.

45 మందిని వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి....

ఎల్బీనగర్​లో నోటా 45 మందిని వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచింది. ఎల్బీనగర్​లో మొత్తం 48 మంది వివిధ పార్టీలు, ఇండిపెండెంట్​అభ్యర్థులు పోటీ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్​అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించగా, బీజేపీ నుంచి సామ రంగా రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్​ నుంచి మధు యాష్కీ గౌడ్​ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2,966 ఓట్లతో నోటా నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే మల్కాజ్​గిరిలో 33 మంది, ఉప్పల్​లో 32 మంది, శేరిలింగంపల్లిలో 31 మంది బరిలో ఉండగా, అనూహ్యంగా నోటా నాలుగవ స్థానంలో నిలిచింది. ఎంఐఎం, ఎంబీటీ పార్టీలు పోటీచేసిన చోట్ల ఐదు, ఆరు స్థానాలకు నోటా పరిమితమయింది. అయితే మెజారిటీ సెగ్మెంట్లలో నోటా తర్వాతి స్థానాల్లో బీఎస్పీ, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్అభ్యర్థులు ఉండటం గమనార్హం.

చేవెళ్లలో మెజారిటీని దాటిన నోటా...

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్​ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్​ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు రాగా, కాంగ్రెస్​ అభ్యర్థి భీమ్​ భరత్​కు 75,950 ఓట్లు వచ్చాయి. కేవలం 268 ఓట్ల అతిస్వల్ప మెజారిటీతో కాలె యాదయ్య కాంగ్రెస్​ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ నోటాకు1,423 ఓట్లు రావడం గమనార్హం. యాకుత్​పురాలో ఎంఐఎం అభ్యర్థి 878 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఇక్కడ నోటాకు 704 ఓట్లు పోలయ్యాయి. చేవెళ్లలాంటి పరిస్థితే గతంలో అంబర్​పేట సెగ్మెంట్​లో కిషన్​ రెడ్డికి కూడా ఎదురైంది. ఇలా గెలుపు ఓటములను డిసైడ్​ చేసే స్థాయిలో నోటా ఓట్లు ఉంటుండటంతో నోటా పేరు చెబితేనే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.