ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని 7జిలాల్లో కనీసం 2 లేదా 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కు పలు అంశాలపై వినతులు ఇచ్చామని, ప్రధానంగా 5 అంశాలపై కేంద్రాన్నిసహాయం కోరామని ఆయన అన్నారు.
కొత్త వైద్య కళాశాలల మంజూరుకు ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాచలం, భూపాలపల్లి, తాండూరు లేదా వికారాబాద్ జిల్లాలను సూచించామని చెప్పారు ఈటెల. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో రెండు రీజినల్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరామని, రాష్ట్రంలో గాంధీ, నిలోఫర్, ఉస్మానియా ఆసుపత్రులకు రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లు మంజూరు చేయాలని కొరామని ఆయన తెలిపారు.11 ప్రాంతాల్లో జాతీయ రహదారుల వెంట ట్రామ కేర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర సహకారాన్ని ఆడిగామన్నారు. రాష్ట్రాల అవసరాల దృష్ట్యా సహకారం అందించాలని కేంద్రానికి చెప్పామన్నారు.
పేదల ఆరోగ్యం కోసం రాష్ట్రంలో సంవత్సరానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని,ఆయుష్మాన్ భారత్ కంటే మంచిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రికి చెప్పినట్టు ఈటెల తెలిపారు.