సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారు పార్టీలో ఉండరు

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేవారు పార్టీలో ఉండరు

సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై దుష్ప్రచారం చేసేవారికి పార్టీ లో చోటు ఉండదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఓటమి గెలుపునకు పునాది అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ జెండాను కిందపడనివ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.  ‘‘ హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే నేను కుంగిపోయాను. ఆ దశలో నాకు కార్యకర్తలే అండగా నిలబడ్డారు’’ అని గుర్తు చేసుకున్నారు.  కార్యకర్తలు నింపిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తామని, వచ్చే సంవత్సరం జూన్ , జులై లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  

సోనియా గాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెబితే వాళ్లను..

365 రోజుల తర్వాత..  సోనియా గాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెబితే.. వాళ్లను పల్లకిలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామని రేవంత్ వెల్లడించారు. ‘‘నా లక్కీ నెంబర్ 9 .. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతాం ’’ అని చెప్పారు. బీజేపీ , టీఆర్ఎస్ కంటే ఎక్కువ మందితో పరేడ్  గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించి తీరుతామని ఆయన చెప్పారు.   90 రోజుల్లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం కార్యక్రమంలో 45 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని తెలిపారు. ‘‘ సచివాలయమే లేదు. కానీ సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు  అనే సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా బండి సంజయ్ అడుగుతున్నారు. కాళేశ్వరం , డబుల్ బెడ్ రూమ్స్ , కేసీఆర్ అవినీతిపై బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులు చేస్తే మంచిది’’ అని రేవంత్ కామెంట్ చేశారు.