పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదంపై పోరులో భారత్ కు అంతర్జాతీయంగా మద్దతు అందుతోంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు యూఎన్ లో ప్రతిపాదిస్తామని ఫ్రాన్స్ ఇప్పటికే ముందుకొచ్చింది. టెర్రరిజాన్ని అంతం చేయడంలో భారత్ కు అండగా నిలుస్తామని తెలిపింది.
అదే బాటలో మరి కొన్ని దేశాలు ఇండియాకు సపోర్టుగా ఉంటామంటున్నాయి. బుధవారం రష్యా మంత్రి డెనిస్ మాంటురోవ్ తమ దేశ మద్దతును ప్రటించారు. యూఎన్ భద్రతా మండలిలో మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించే ప్రతిపాదన వస్తే తాము ఇండియాకు అనుకూలంగా ఓటేస్తామని చెప్పారు. పుల్వామా దాడిలో అమరులైన భారత జవాన్లకు సంతాపం తెలిపారాయన. ఉగ్ర పోరు విషయంలో భారత్ కు తమ పూర్తి సపోర్ట్ ఉంటుందని డెనిస్ చెప్పారు.
