కేసీఆర్ను జైలుకు  పంపుడు పక్కా

కేసీఆర్ను  జైలుకు  పంపుడు పక్కా

విచారణ భయంతోనే మళ్లా సెంటిమెంట్ రాజేస్తున్నడు 
ఆయనో చెల్లని రూపాయి.. పక్క రాష్ట్రాలకు పోతే ఎవరూ దేకలే
ఢిల్లీ కోట కాదు.. ముందు నీ కోట బద్దలు కాకుండా చూసుకో 
దమ్ముంటే.. కేంద్రం అవినీతి ఏందో బయట పెట్టాలని సవాల్ 
జనగామలో సభ పెట్టి సత్తా చూపిస్తామన్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

హైదరాబాద్/పెద్దపల్లి, వెలుగు: ‘‘తన అవినీతిపై విచారణ ప్రారంభమైందేమోనని సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు. తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోంది. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తుండు” అని సీఎం కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘కేసీఆర్.. నువ్వు ఎన్ని  చేసినా, నీ అవినీతి సొమ్మును కక్కించే దాకా వదలం. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లెక్క దేశం వదిలి పారిపోదామనుకుంటున్నావేమో.. దొంగ పాస్ పోర్టులు నీకు అలవాటే.. అయినా నీ ఆటలు సాగవు. నిన్ను రాష్ట్రం వదలి పోనియ్యం.. జైల్లో పెట్టుడు ఖాయం” అని హెచ్చరించారు. ‘‘ఢిల్లీ కోటలు బద్దలు కొడ్తడట. కేసీఆర్.. నువ్వు ఏమైనా తీస్ మార్ ఖాన్ వా? ప్రధాని మోడీని చూస్తేనే వంగి వంగి దండాలు పెడ్తవ్.. ఇలాంటి మాటలు మాట్లాడానికి సిగ్గుండాలి. ఢిల్లీ కోట కాదు.. ముందు నీ కుటుంబ కోట బద్దలు కాకుండా చూసుకో” అని ఫైర్ అయ్యారు. జనగామ సభలో మోడీపై కేసీఆర్ కామెంట్లు చేయడంపై సంజయ్ మండిపడ్డారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో, పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్​రావు తల్లి ఇటీవల మరణించగా, పెద్దపల్లిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. 
కేసీఆర్.. బీజేపీని ఏం చేయలేవ్  
బీజేపీని టార్గెట్ చేయడానికే సీఎం సభ పెట్టినట్లుందని సంజయ్ అన్నారు. మోడీ మాటల్లో తప్పు లేదు కాబట్టే.. వాటిపై సీఎం ఏం మాట్లాడలేదని చెప్పారు. బీజేపీని కేసీఆర్ ఏమీ చేయలేడన్నారు. ‘‘కేసీఆర్.. నువ్వేం పీకలేవ్. ఉఫ్ అని ఊదుతవా? నీది గింతంత పార్టీ. మాది ప్రపంచంలోనే నంబర్ వన్ పార్టీ. మాతో పెట్టుకుంటే మాడి మసైపోతవ్.. జాగ్రత్త. మమ్మల్ని నశం చేస్తావా.. మేం జండూబామ్ పెడ్తం” అంటూ హెచ్చరించారు. ‘‘నువ్వు పెట్టిన జనగామలోనే సభ పెడ్త. నీ లెక్క బీరు, బిర్యానీ, రూ.500 ఇవ్వం. మా కార్యకర్తలు గర్జిస్తే, నీ చెవుల్లో రక్తం కారాలి. కేసీఆర్.. మా దమ్మేందో చూపిస్తాం” అని సవాల్ విసిరారు. ‘‘బహిరంగ సభలో మేం డ్రంకన్ డ్రైవ్ చేస్తం. తాగినట్టు తేలితే జైలుకు పంపుతం. ఆ స్కీమ్ ను నీ కోసం కచ్చితంగా తీసుకొస్తం” అని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. 
సీఎం క్షమాపణలు చెప్పాలే... 
కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టినట్లుందని సంజయ్ అన్నారు. సీఎం మాట్లాడేది తెలంగాణ భాష కాదని, ఆయన భాష చూసి జనం ‘‘ఛీ.. థూ’’ అంటున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై, ప్రధానిపై కామెంట్లు చేసిన, తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ ను ఇక్కడే ఎవరు దేకడం లేదు. డబ్బు సంచులు పంపినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తమిళనాడు, ఒడిశా, బెంగాల్ పోయి గుళ్లు, గోపురాలు తిరిగి వచ్చిండే తప్ప.. అక్కడా ఎవరూ దేకలేదు. ఇక్కడికొచ్చి మళ్లీ తీస్ మార్ ఖాన్ లెక్క చక్రం తిప్పుతానని కథలు చెప్తుండు. నీ ముఖం చెల్లడం లేదు. నీది చెల్లని రూపాయి” అంటూ కేసీఆర్​పై సంజయ్ మండిపడ్డారు. బోర్లకు కరెంట్ మీటర్లు పెడతామని కేంద్రం చెప్పిందా? దమ్ముంటే నిరూపించు అని సవాల్ విసిరారు. స్టేట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
దమ్ముంటే.. కేంద్రం అవినీతి బయటపెట్టు 
కేంద్రం అవినీతి చేసిందని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్... దమ్ముంటే ​కేంద్రం అవినీతిని బయట పెట్టాలని సంజయ్ సవాల్ విసిరారు. ఎప్పుడు? ఎక్కడ? బయటపెడ్తడో చెప్తే తానే వెళ్తానని చెప్పారు. ఇందుకోసం తానే సభ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ‘‘కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహరా కుంభకోణంలో పాత్రధారివి నువ్వు కాదా?’’ అని సీఎంను ప్రశ్నించారు.