కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు  భయపడం

కేసీఆర్​ తాటాకు చప్పుళ్లకు  భయపడం
  • వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయనను పాకిస్తాన్ 
  • టెర్రరిస్టులు కాపాడలేరు
  • బీజేపీపై కక్షగట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధిచెప్తం
  • చంపాపేటలో బీజేపీ 
  • హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు, కేసులకు, దాడులకు బీజేపీ భయపడబోదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదని హెచ్చరించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో  ఓటమి నుంచి కేసీఆర్​ను పాకిస్తాన్ టెర్రరిస్టులు కాపాడలేరు. కల్వకుంట్ల కుటుంబం పోయి..‌ బీజేపీ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నరు. తన పాలనలో అన్ని వర్గాలను మోసం చేయటమే కేసీఆర్ తీసుకొచ్చిన గుణాత్మమైన మార్పు” అని దుయ్యబట్టారు. బీజేపీ లోక్​సభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్​లు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా చంపాపేటలో నిర్వహించిన హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గ రివ్యూ సమావేశానికి కిషన్​రెడ్డి హాజరై మాట్లాడారు. సెక్రటేరియట్​కు  రాకుండా పాలన చేయటం, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయటం, ఉద్యోగాలు ఇవ్వకపోవటం ఇవన్నీ  కేసీఆర్ తెచ్చిన  గుణాత్మకమైన మార్పులని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కేసీఆర్ మాదిరిగా బీజేపీ కుటుంబ పార్టీ కాదని చెప్పారు. ‘‘దేశంలో కూడా కల్వకుంట్ల కుటుంబ పెత్తనం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నరు. బంగారు తెలంగాణ కాలేదు గానీ రాష్ట్రం వచ్చాక కేసీఆర్  కుటుంబం బంగారు కుటుంబం అయింది” అని అన్నారు. వడ్లను కొనేది కేంద్రం మాత్రమేననే విషయం రైతులకు అర్థమైందన్నారు. పొదుపు సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీపై కక్షకట్టిన కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. 

టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనే: లక్ష్మణ్ 
ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం తిరస్కరించిందని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ మాత్రమేనని, కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్లు కోల్పోయారన్నారు. వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు.  

సమస్యలపై సర్కారును నిలదీస్తం: రాజాసింగ్ 
రైతులు, పబ్లిక్ సమస్యలపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలం పోరాటం చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్  చెప్పారు. కేసీఆర్​కు కేటీఆర్​తో పాటు మరో ఇద్దరు కొడుకులు ఉన్నారని, వారు అసదుద్దీన్ , అక్బరుద్దీన్​లు అని అన్నారు.  దేశంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖతం అయిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోక్​సభ నియోజకవర్గ సీటును బీజేపీ గెలుస్తుందని, ఒవైసీని ఇంట్లో కూర్చోపెడ్తామని చెప్పారు. ‘‘కేసీఆర్ తనకు తాను సింహం అనుకుంటడు. బీజేపీకి ఆయన ఎలుకతో సమానం. తెలంగాణ కేసీఆర్​ జాగీరు కాదు’’ అని అన్నారు. 

 జైలుకు పోతానన్న భయంతోనే  దేశంలో పర్యటిస్తుండు: సంజయ్​ 
‘‘ఫామ్ హౌస్​లో ఉన్న కేసీఆర్​ను బీజేపీ గల్లా పట్టి  గుంజితేనే బయటకు వచ్చిండు.  జైలుకు పోతానన్న భయంతోనే  దేశంలో పర్యటిస్తుండు. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్​కు ఇంటి పోరు ఎక్కువైంది” అని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేసి తీరుతమని ప్రకటించారు. టీఆర్​ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్లు నిర్మించుకోవడానికి బడ్జెట్​లో నిధులు కేటాయించుకోవాలన్నారు. పాతబస్తీలో గణేశ్​ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించారు. యూపీలో నిర్మిస్తున్న రామ మందిరం మాదిరిగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని నిర్మిస్తామన్నారు.