
ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తం
గిగ్ వర్కర్ల హక్కులు కాపాడుతం
సింగరేణికి కొత్త గనులు అవసరం
కనీస వేతనాలపై స్టడీ చేస్తం
మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా సెక్రటేరియెట్లో బాధ్యతల స్వీకరణ
రూ.2,070 కోట్లతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు
ఫైల్పై తొలి సంతకం
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేసి సామాన్యులకు తక్కువ రేటుకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి వెల్లడించారు. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణకు, ఇసుక సరఫరాకు మెరుగైన పాలసీలు తెస్తామని తెలిపారు. రూ. 2,070 కోట్లతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణికి కొత్త గనులు అవసరమని, ఆక్షన్ లో పాల్గొని దక్కించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్లోని రెండో ఫ్లోర్లో తనకు కేటాయించిన చాంబర్లో మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకట స్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు వివేక్కు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల (రోజువారీ వేతనాలపై ఆధారపడేవారు) హక్కుల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గిగ్ వర్కర్ల కోసం మంచి పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని, వారిని ఆదుకోవాలని చెప్పారు. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు చాలా తక్కువ హక్కులు ఉన్నాయని, వారి సమస్యలను పరిష్కరించడానికి, మెరుగైన విధానం రూపొందించడానికి వచ్చే నెలలో నిపుణులతో విస్తృతస్థాయిలో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్స్పర్ట్స్నుంచి వచ్చే సలహాలు, పరిష్కారాల ఆధారంగా త్వరలోనే గిగ్ వర్కర్లకు ఒక మంచి పాలసీ తీసుకురానున్నట్లు చెప్పారు.
తక్కువ ధరకే ఇసుక..
మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇసుక మాఫియాను కట్టడి చేసి వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నదని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇసుక మాఫియాపై నిఘాపెట్టి, పూర్తిగా అరికడుతామని చెప్పారు. ప్రస్తుతం ఇసుక ధరలు అధికంగా ఉన్నాయని, ప్రభుత్వానికి తక్కువ ఆదాయం వస్తున్నదని, దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని తెలిపారు.
సింగరేణికి కొత్త గనులు కేటాయించడానికి కృషి చేస్త
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు తగ్గిపోతున్నందున.. కొత్త గనుల కేటాయింపు అవసరమని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాట్మెంట్ పద్ధతిలో గనులు కోరినప్పటికీ, టైం అయిపోయిందని, పార్లమెంట్ బిల్లు ద్వారా ఆక్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఒడిశాలోని నైనీలో సింగరేణి సంస్థకు ఆక్షన్ ద్వారా 25 మిలియన్ టన్నుల బొగ్గు గనులు లభించినప్పటికీ, అక్కడ స్థానికులకే ఉద్యోగాలు వస్తున్నాయని, తెలంగాణ నిరుద్యోగులకు రావడం లేదని అన్నారు. ఆక్షన్ లో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని, తెలంగాణలో కొత్త గనులు రావాలని, తద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించాలని సీఎం రేవంత్ను కోరినట్లు మంత్రి తెలిపారు. ఆక్షన్ పద్ధతిలో 4% మాత్రమే డ్యూటీ ఉంటుందని, అలాట్మెంట్లో 18% ఉంటుందని, కాబట్టి సింగరేణి సంస్థకు కూడా ఇది లాభదాయకమేనని చెప్పారు. ఆక్షన్ పద్ధతిలో వెళ్లాలని సీఎంకు సూచించినట్లు వివరించారు. కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణికి లాభదాయకంగా ఉంటుందని, డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్) నిధులు, సీఎస్ఆర్ నిధులు కూడా ఎక్కువగా లభిస్తాయని, అవి స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు.
కార్మికులకు కనీస వేతనాలు అందేలా చూస్త
తాడిచర్ల మైనింగ్ గురించి ప్రశ్నించగా.. అది ఇప్పటికే 12-–14 సంవత్సరాలుగా నడుస్తున్నదని, అగ్రిమెంట్ను పరిశీలించిన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని మంత్రి వివేక్ తెలిపారు. తాడిచర్ల మైనింగ్ పవర్ సెక్టార్ కిందకు వస్తుందని, తన శాఖ పరిధిలోకి రాదని వివరించారు. కనీస వేతనాలపై పరిశీలన చేస్తామని, కొత్త పరిశ్రమలు రావాలని, ఎక్కువ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. అదే సమయంలో కార్మికులకు కనీస వేతనాలు అందేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కనీస వేతనాలు ఎలా ఉన్నాయో స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏటీసీల ఏర్పాటు ఫైల్పై తొలి సంతకం
రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం రూ. 2,070 కోట్లతో 46 కొత్త అడ్వాన్స్డ్టెక్నాలజీ సెంటర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ఏటీసీల ఏర్పాటు ఫైల్పై తొలి సంతకం చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా స్థానికులకు శిక్షణ ఇచ్చి, నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి వివరించారు. గతంలో లేబర్ సెక్రటరీ దాన కిశోర్ ఆధ్వర్యంలో జరిగిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్స్కు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కొత్త టెక్నాలజీలను ఈ కేంద్రాల్లో చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ 46 కేంద్రాలు త్వరలోనే అమల్లోకి వస్తాయని, మారుమూల ప్రాంతాల్లో కూడా నైపుణ్యాభివృద్ధికి దోహదపడతాయన్నారు.