ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తాటతీస్తాం

ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకుంటే తాటతీస్తాం
  • తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల హెచ్చరిక 

బషీర్​బాగ్, వెలుగు: జీహెచ్ఏంసీ, ఓఆర్ఆర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉచిత ఆటో పర్మిట్లను అడ్డుకోవాలని చూస్తే తాటతీస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ల సంఘాల జేఏసీ హెచ్చరించింది. వడ్డీ రాబందులైన కొందరు ప్రైవేట్ ఆటో ఫైనాన్షియర్లు తమను నిలువు దోపిడీ చేసేందుకు ఉచిత పర్మిట్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో  జేఏసీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ బి.వెంకటేశం, ఎస్. అశోక్ (ఏఐటీయూసీ), వి.మారయ్య, మహేశ్ (బీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ),  అజయ్‌‌‌‌‌‌‌‌బాబు (సీఐటీయూ), వి.ప్రవీణ్‌‌‌‌‌‌‌‌, లింగం గౌడ్ (టీయూసీఐ), ఎం.ఎ.సలీం, రఫీక్ (యూటీఏడీడబ్యూఏ) కలిసి మాట్లాడారు. గత 12 ఏండ్లుగా ప్రైవేట్ ఆటో ఫైనాన్షియర్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కాలం చెల్లిన పాత ఆటోల పర్మిట్లపై కొత్త ఆటోలు కొనుగోలు చేస్తూ రూ.కోట్ల అక్రమ వ్యాపారం నడుపుతున్నారని ఆరోపించారు. నేటికీ సుమారు 80 వేల ఆటో పర్మిట్లు ఫైనాన్షియర్ల దగ్గరే ఉన్నాయన్నారు. ఆటో ధర షో రూమ్​లో​రూ. 2.70 లక్షలు ఉంటే ఫైనాన్షియర్లు రూ.5 లక్షలకు అమ్ముతున్నారన్నారు. 

కొత్త ఆటోల కోసం మళ్లీ వీరే రుణం ఇచ్చి, డ్రైవర్లను శాశ్వత రుణగ్రస్తులుగా మారుస్తున్నారని ఆరోపించారు. తాజాగా నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆటో పర్మిట్ల జీఓ జారీ చేసినా, ఫైనాన్షియర్లు తమ అక్రమ వ్యాపారం కొనసాగించేందుకు ఈ పర్మిట్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నాలను ఆపకుంటే ఆటో ఫైనాన్షియర్ల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.