ఎట్టకేలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జూలై 4, 5 తేదీల్లో ఆంధ్ర జిల్లాలు .. బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడతో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ,ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు,నంధ్యాల,అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాలు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణశాఖ వెల్లడించింది.
ఏపీలో ఇలా....
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు .. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో...
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాలలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈదురుగాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు.దీని ప్రభావంతో రేపటి(జులై4) నుంచి మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఐఎండీ తెలిపింది
ఈ నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాత్ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ALSO READ:వరుణ దేవా కరుణించవా...కరీంనగర్లో కప్పతల్లి ఆటలు..
హైదరాబాద్ లో ఇలా...
ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న ( జులై 2) గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతంగా నమోదైంది.
14 జిల్లాల్లో రెడ్ అలర్ట్
తెలంగాణలో 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. అలాగే ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు.