కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇంటి నుంచి పెండ్లి మండపానికి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెండ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన సిద్ధిరాములు కొడుకు భరత్ పెండ్లి బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరగాల్సి ఉంది.
పెండ్లి మండపానికి వెళ్లేందుకు పెండ్లి కొడుకు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి సుమారు ఎనిమిది మంది కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి శివారులో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో పెండ్లి కొడుకు తల్లిదండ్రులు వినోద, సిద్ధిరాములు సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
