
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళం ఫైటర్ జెట్లు కోల్పోయిందని మన రక్షణ అధికారులే చెప్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశాన్ని తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పాకిస్తాన్లోని టెర్రర్ స్థావరాలపై దాడులకు భారత సైన్యం మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మన ఎయిర్ ఫోర్స్ కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయిందని భారత రక్షణకు చెందిన సీనియర్ అధికారి శివ్ కుమార్ ఇండోనేసియా పర్యటనలో వెల్లడించారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్లో మన సైన్యానికి వాటిల్లిన నష్టం వివరాలు ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
అయితే, ఈ కామెంట్లపై ప్రభుత్వం, రక్షణ శాఖ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఈ విషయాలు మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ దాస్తున్నదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. జెట్లు కోల్పోయామని శివ్ కుమార్ మన దేశంలో వెల్లడించకుండా విదేశాల్లో వ్యాఖ్యలు చేయడం వారిపై రాజకీయ ఒత్తిడిని సూచిస్తున్నాయన్నారు.