ఆపరేషన్ సిందూర్‌‌లో జెట్‌‌లు కోల్పోయామా? ప్రధాని మోదీ వాస్తవాలు వెల్లడించాలి: కాంగ్రెస్

ఆపరేషన్ సిందూర్‌‌లో జెట్‌‌లు కోల్పోయామా? ప్రధాని మోదీ వాస్తవాలు వెల్లడించాలి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌లో భారత వైమానిక దళం ఫైటర్ జెట్‌‌లు కోల్పోయిందని మన రక్షణ అధికారులే చెప్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దేశాన్ని తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పాకిస్తాన్‌‌లోని టెర్రర్​ స్థావరాలపై దాడులకు భారత సైన్యం మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మన ఎయిర్ ఫోర్స్ కొన్ని ఫైటర్ జెట్​లను కోల్పోయిందని భారత రక్షణకు చెందిన సీనియర్​ అధికారి శివ్​ కుమార్​ ఇండోనేసియా పర్యటనలో వెల్లడించారు. 

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ​తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్​లో మన సైన్యానికి వాటిల్లిన నష్టం వివరాలు ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

అయితే, ఈ కామెంట్లపై ప్రభుత్వం, రక్షణ శాఖ నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. ఈ విషయాలు మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ దాస్తున్నదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. జెట్‌‌లు కోల్పోయామని శివ్ కుమార్ మన దేశంలో వెల్లడించకుండా విదేశాల్లో వ్యాఖ్యలు చేయడం వారిపై రాజకీయ ఒత్తిడిని సూచిస్తున్నాయన్నారు.