దేశ ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నది
పేదలు, కార్మికులు కష్టాలు పడుతున్నరు: కాంగ్రెస్ చీఫ్
22 ప్రతిపక్ష పార్టీలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశంపై క్రూయల్ జోక్ అని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ విమర్శించారు. దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం చేకూరడం లేదని అన్నారు. కరోనా సిచ్యువేషన్ను కంట్రోల్ చేయడంలో, పేదల ఇబ్బందులు తొలగించడంలో, కార్మికులను సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం ఫెయిలైందని, ఫెడరలిజం స్ఫూర్తిని మరిచిపోయిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 22 ప్రతిపక్ష పార్టీల నేతలతో శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా, లాక్డౌన్ పరిస్థితులపై చర్చించారు. సరైన ప్లాన్ లేకుండా లాక్డౌన్ను కేంద్రం విధించిందని, ఇప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అవడానికి కూడా సరైన ప్లాన్ను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ విమర్శించారు. కోట్ల మంది వలస కార్మికుల కుటుంబాలను పూర్తిగా విస్మరించిందని, వారికి సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. ‘‘ప్రధాని రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని మే 12న ప్రకటిస్తే.. దాని వివరాలను ఐదురోజులపాటు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటిస్తూ వచ్చారు. ఇది దేశంపై క్రూయల్ జోక్లాంటిది. అన్ని అధికారాలను ప్రధానమంత్రి ఆఫీస్ తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది వ్యతిరేకం. కరోనా లాంటి సిచ్యువేషన్పై పార్లమెంట్లో కానీ, స్టాండింగ్ కమిటీల్లో కానీ చర్చించాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు” అని సోనియాగాంధీ మండిపడ్డారు.
21 రోజుల్లో అని చెప్పి..
కరోనాతో 21 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని మొదట ప్రధాని చెప్పారని, ఇప్పటికే 4 సార్లు లాక్డౌన్ను పొడిగించారని, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేదాకా ఇంట్లోనే ఉండే పరిస్థితులు వచ్చాయని సోనియాగాంధీ అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రానికి స్పష్టమైన విధానం లేకుండా పోయిందని విమర్శించారు. కరోనా టెస్టుల్లోనూ ప్రభుత్వం ఫెయిలందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, జార్ఖండ్సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, డీఎంకే లీడర్ స్టాలిన్, జేడీఎస్ లీడర్ దేవేగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, టీజేఎస్ నేత ప్రోఫెసర్ కోదండరామ్తో పాటు కాంగ్రెస్ నేతలు రాహుల్, ఆంటోనీ, పలు రీజినల్ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆప్ నుంచి ఎవరూ పాల్గొనలేదు. అంతకు ముందు మాయావతి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
For More News..
