హైదరాబాద్, వెలుగు: పీక్ టైమ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తూ రాష్ట్రంలో అసలే కరెంట్ కోతలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనుగోలు చేసే కరెంట్ ఖర్చును కూడా తగ్గించుకోవాలని యోచిస్తున్నది. రాష్ట్రంలో సోలార్ బ్యాటరీ పవర్తో నడిచే కరెంట్ సప్లయ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) అంటే ఏంటి..?
మనం ఇండ్లల్లో కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్లను ఎలాగైతే ఉపయోగించి విద్యుత్ లైట్లు వెలిగేలా, ఫ్యాన్లు తిరిగేలా పవర్ వినియోగిస్తామో.. అలాగే, భారీ స్థాయిలో బ్యాటరీల సహాయంతో విద్యుత్ శక్తిని నిల్వ చేసి, అవసరమైనప్పుడు దాన్ని వినియోగించే వ్యవస్థనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) అంటారు. సోలార్, గాలి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్ను బ్యాటరీలలో నిల్వ చేసి సూర్యుడు లేని సమయంలో.. అంటే పీక్ పీరియడ్లో నిల్వ చేసిన విద్యుత్ను ఉపయోగించుకోవడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
విద్యుత్ నిల్వ చేయడానికి లీథియం, ఐయాన్, ఫ్లో బ్యాటరీలను ఉపయోగిస్తారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్) పద్ధతి ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తారు. షార్ట్గా చెప్పాలంటే విద్యుత్ను ‘పొదుపు’ చేసి అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడే ఆధునిక బ్యాటరీ వ్యవస్థ అని అర్థం. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్లో వినియోగించబడని కరెంట్ను ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు.
ఉపయోగాలు ఏంటి..?
పీక్ టైమ్లో విద్యుత్ కొనుగోళ్ల రేట్లు అధికంగా ఉంటాయి. విద్యుత్ శాఖ ఉద్దేశంలో ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఉన్న సమయాన్ని పీక్ టైమ్గా పేర్కొంటారు. ఈ టైమ్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గృహ, ఇండస్ట్రీయల్, ఇతర అవసరాలకు కరెంట్ సప్లయ్ చేయడానికి బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూనిట్పై రూ.1 నుంచి రూ.3 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.
దీంతో కొన్నిసార్లు డిమాండ్కు అనుగుణంగా కరెంట్ సప్లయ్ చేయలేక విద్యుత్ కోతలు విధిస్తారు. దీంతో పెద్ద, పెద్ద ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, డేటా సెంటర్లలో బ్యాకప్ పవర్ వినియోగిస్తూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అయితే, బీఈఎస్ఎస్ సిస్టమ్ ద్వారా విద్యుత్ కోతలను తగ్గించొచ్చు. 24/7 విద్యుత్ పునరుత్పాదక శక్తి అందుబాటులో ఉంచుతుంది. పీక్ టైమ్లో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. గ్రిడ్ స్థిరత్వం పెరుగుతుంది. వేల కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులు తగ్గిపోతాయి.
