మానవ శరీరం ఎంత బలమైనదంటే.. మన చుట్టూ ఉండే సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్లతో నిత్యం పోరాడుతూనే ఉంటుంది. శారీరకంగా ఎంత బలహీనపడినా తిరిగి ఉత్తేజాన్ని ఇస్తుంది. అలాంటి బాడీ కొన్ని అనారోగ్య సమస్యలకు మాత్రం తలొగ్గుతుంది. అలాంటివాటిలో ఒకటి డయాబెటిస్. ఆల్రెడీ దానితో బాధపడుతున్నవాళ్లు ఎవరికీ ఈ సమస్య రాకూడదు అని కోరుకుంటారు. ఎందుకంటే అది దీర్ఘకాలిక సమస్య కావడం ఒక కారణం అయితే.. డయాబెటిస్ వల్ల అంచెలంచెలుగా ఆరోగ్యం సన్నగిల్లుతుంటుంది. రోజులు గడిచేకొద్దీ అనేక రకాల శారీరక ఇబ్బందులు చుట్టుముడతాయి.
వాటినుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఇంకా చెప్పాలంటే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటికే డయాబెటిస్ వల్ల కలిగే ఇబ్బందుల గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. అయితే కొన్ని సమస్యల గురించి మాత్రం సరైన అవగాహన ఉండట్లేదు. అలాంటివాటిలో ఒకటే డయాబెటిక్ ఫుట్. చాలామందికి దీని గురించి తెలియకపోవచ్చు. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా (నవంబర్ 14న) ఈ అంశం మీద డాక్టర్ రాహుల్ స్పందన ఇది.
డయాబెటిక్ ఫుట్ మీద సామాన్య ప్రజల్లో అవగాహన పెద్దగా లేదు. సాధారణంగా మనం తిన్న తర్వాత షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. షుగర్ అదుపులో లేకపోతే డయాబెటిక్ ఫుట్ రావొచ్చు. ఇంతకీ ఈ సమస్య ఏంటి? ఎందుకొస్తుంది? అంటే.. మామూలుగా తిన్న తర్వాత బాడీలో గ్లైకేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దాని వల్ల డయాబెటిస్ ఉన్నవాళ్లలో నరాలు, రక్తనాళాలు, కాలి కణజాలాల్లో డ్యామేజ్ జరుగుతుంది. రక్తసరఫరా తగ్గిపోతుంది. నరాల్లో డ్యామేజ్ జరిగితే స్పర్శ కోల్పోతారు. అయితే ఇది వెంటనే వచ్చే సమస్య కాదు. కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది.
►ALSO READ | స్పెషల్ కెమెరాతో.. ఫోన్ కి కనెక్ట్ అయ్యే ఇయర్ వ్యాక్స్ రిమూవర్
డయాబెటిక్ ఫుట్ ఉంటే మొదట కాలిలో మంటగా అనిపిస్తుంది. అంటే నరాలు డ్యామేజ్ అవ్వడం మొదలైందని అర్థం చేసుకోవాలి. అయితే, కాలిలో ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు వాళ్లకు నొప్పి తగ్గడానికి మెడిసిన్ రాసిచ్చి, షుగర్ కంట్రోల్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ సమస్య పెద్దది కాకుండా ఆపగలం. కానీ, పూర్తిగా నయం చేయలేం. తద్వారా కొన్నాళ్లవరకు సమస్య మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చేయొచ్చు. ముందుగానే తెలుసుకుంటే ఐదారేండ్లలో వచ్చే సమస్యను పది లేదా పదిహేనేండ్ల వరకు రాకుండా ఆపొచ్చు.
చాలాకాలంగా డయాబెటిస్తో బాధపడేవాళ్లలో ఈ సమస్య తలెత్తుతుంది. రోజులు గడిచేకొద్దీ నొప్పి పెరుగుతూ ఉంటుంది. తర్వాత కాళ్లకు స్పర్శ తగ్గిపోవడంతో చెప్పులు జారిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా మెల్లగా కాళ్లు పూర్తిగా స్పర్శ కోల్పోతాయి. చెప్పులు వేసుకున్నా స్పర్శ లేకపోవడం వల్ల కళ్లతో చూసుకునేవరకు నమ్మలేరు. వేడి లేదా చల్లని వాతావరణంలో కాలు మోపినప్పుడు కూడా వాళ్లకు స్పర్శ తెలియదు. అలాంటప్పుడు వాళ్లు కాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి గాయాలు, ఇన్ఫెక్షన్లు కాకుండా అప్రమత్తంగా ఉండాలి.
అస్సలు వాడొద్దు
ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కాళ్లను కూడా అలాగే చూసుకోవాలి. పొద్దున లేవగానే కాళ్లకు ఏమైనా గాయం ఉందా? అని తేరిపార చూడాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. కాలి వేళ్ల మధ్యలో ఏమాత్రం తడి లేకుండా తుడుచుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తడి మీద మాయిశ్చరైజర్ పూసుకోకూడదు.
అలాచేస్తే తేమ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే చాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు సాదాసీదా చెప్పులు అస్సలు వాడొద్దు. కాళ్లను కప్పి ఉంచేలా షూస్ వేసుకోవాలి. శాండిల్స్ అయితే ఉంగుటము (టో సపరేటర్) ఉండకూడదు. అలాగే ఎప్పుడూ సాక్స్ ధరించాలి. బయటకు వెళ్లేముందు, తిరిగి వచ్చిన తర్వాత కాళ్లను చూసుకోవాలి. ఇంట్లో కూడా శాండిల్స్ లేదా షూ వేసుకోవాలి.
అవేర్నెస్ లేకపోవడం వల్ల
చాలామంది అవేర్నెస్ లేకపోవడం వల్ల సమస్య పెద్దదైన తర్వాత మేల్కొంటున్నారు. సమస్య రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం తప్ప మరేమీ చేయలేం. కాళ్లకు సంబంధించి ఏవైనా ఇబ్బంది కలిగించే లక్షణాలు ఉంటే ప్రతి ఆరు నెలలు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడు దీని గురించి పూర్తిగా అవేర్నెస్ వచ్చేలా కౌన్సెలింగ్ ఇస్తాం.
దాంతోపాటు ప్రివెంటివ్ ఫుట్వేర్ వాడమని సజెస్ట్ చేస్తాం. ఆ ఫుట్వేర్ కాలు మొత్తాన్ని కవర్ చేస్తుంది. దానికి ఎడ్జ్ షార్ప్గా ఉండదు. కాళ్లకు ఏమాత్రం హాని చేయవు. కానీ, వీటిని బయట దొరికే స్టోర్స్లో తీసుకోకూడదు. హాస్పిటల్కు వెళ్తే అక్కడ పేషెంట్ కాలు కొలతలు తీసుకుని దానికి తగినట్టు ఫుట్ వేర్ సజెస్ట్ చేస్తారు.
రక్తసరఫరా తగ్గితే..
బ్లడ్ సప్లయ్ తక్కువ ఉన్నా, బ్లాకేజ్ జరిగినా కాళ్లలో స్పర్శ తగ్గిపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లకు బ్లడ్ సప్లయ్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్లకు గాయం అయితే త్వరగా మానదు. ముఖ్యంగా మోకాలి కింద ఉన్న రక్తనాళాల్లో కాల్షియం ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల బ్లాకేజీలు ఏర్పడతాయి. దాంతో రక్తసరఫరా తగ్గుతుంది. ఇ
లాంటి పరిస్థితుల్లో బ్లాకేజీలను తెరవడానికి సర్జరీ చేస్తాం. తద్వారా బ్లడ్ సప్లయ్ పెరిగాక వాళ్లకు అయిన గాయాన్ని శుభ్రం చేసి డ్రెస్సింగ్ చేస్తాం. కానీ, కొన్నిసార్లు మెల్లమెల్లగా బ్లాకేజీ అవుతూ ఉంటుంది. సమస్య తిరిగి మొదటికి వస్తుంది. ఈ పరిస్థితి మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు తు.చ. తప్పకుండా పాటించాలి.
- డా. రాహుల్ అగర్వాల్,
సీనియర్ వాస్క్యూలర్ & ఎండోవాస్క్యూలర్ సర్జన్,
కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్
