ఘరానా నేరస్తులకు, కవితకు తేడా ఏముంది?

ఘరానా నేరస్తులకు, కవితకు తేడా ఏముంది?
  • ఘరానా నేరస్తులకు, కవితకు తేడా ఏముంది?
  • క్వశ్చన్​ పేపర్లు అమ్ముకున్న ఘనత కేసీఆర్​ ప్రభుత్వానిదే
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​

పెబ్బేరు, వెలుగు :  లిక్కర్​ స్కాంలో కోట్లు కొల్లగొట్టిన కల్వకుంట్ల కవితకు, ఘరానా నేరస్తులకు పెద్ద తేడా లేదని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆరోపించారు.  ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపూర్​ మండలాల్లో ఆయన పర్యటించారు.  ఈసందర్భంగా ప్రవీణ్​ కుమార్​ మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ ప్రభుత్వానిది కబ్జాల చరిత్ర అని,  పెబ్బేరు  వేణుగోపాల స్వామి గుడి భూములను కబ్జా చేసిన ఘనత అధికార పార్టీ నేతలకే దక్కుతుందన్నారు.  రాష్ట్రంలో ఏ కాంట్రాక్టులు తీసుకోవాలన్నా  సీఎం, మంత్రులు, అధికార పార్టీల నేతల అనుచరులకు, వాళ్ల బంధువులకే ఇస్తున్నారని ఆరోపించారు. మీరేమో బంగ్లాలో ఉండాలె.. మా బీసీ బిడ్డలు, సామాన్య ప్రజలు బిచ్చమెత్తుకోవాల్నా అని ప్రశ్నించారు. 

టీఎస్​పీఎస్సీ క్వశ్చన్​ పేపర్లను ఒక్కొక్కటి  రూ.10లక్షలకు అమ్ముకుని నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు.  రాష్ట్రంలో రైతులను అడ్డా కూలీలుగా మార్చారన్నారు. రాష్ట్రంలో 8,000 మంది రైతులు సూసైడ్​ చేసుకుంటే.. మరో రాష్ట్రానికి వెళ్లి తమ దగ్గర రైతుల ఆత్మహత్యలే  లేవని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.  ఇప్పటి దాకా ఏ స్కూల్​ ను కూడా విజిట్​ చేయని ఘనత కేసీఆర్​ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.  బీఆర్​ఎస్​ ను గద్దె  దించుదామని, రాబోయే రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో బహుజన జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ఇన్​చార్జి చెన్నరాములు, గణపతి నాయుడు పాల్గొన్నారు. 

 జంగ్ సైరన్ మోగించాలే..

గద్వాల, వెలుగు: విద్యుత్ ఎంప్లాయీస్​తమ  న్యాయమైన డిమాండ్ల కోసం వెంటనే జంగ్ సైరన్ మోగించాలని బీఎస్​పీ చీఫ్​ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఇటిక్యాల మండలంలోని వావిలాల, సాతర్ల, ఉదండాపురం, పెద్దదిన్నె గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 శాతం పీఆర్​సీ ఇవ్వాలని విద్యుత్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తే వారిని బెదిరించి భయపెట్టి కేవలం ఏడు శాతానికే పరిమితం చేశారని ఆరోపించారు. ఆర్జిజన్లకు  సౌలతులు కల్పించకుండా సెకండ్​ గ్రేడ్​ ఉద్యోగులుగా చిన్న చూపు చూశారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ తో జాగ్రత్తగా ఉండాలని,  ఆ పార్టీ అధికారంలోకి  వస్తే యూపీ లాంటి ఘటనలే ఇక్కడ జరుగుతాయని ఆరోపించారు. కార్యక్రమంలో కేశవరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.