
తెలంగాణలో అనేక బీసీ కులాలు సంచార జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి. వీరి జనాభా అంచనా ప్రకారం 40 లక్షలకుపైగా ఉండొచ్చని చెబుతున్నారు. వీరి వృత్తులు, జీవన విధానం, సంస్కృతి, సామాజిక స్థితిగతుల గురించి ప్రభుత్వాల వద్ద సరైన గణాంకాలు లేవు. ప్రభుత్వ జాబితాల్లో కేవలం 23 సంచార జాతులు మాత్రమే నమోదు అయ్యాయి. కానీ, మొత్తం 38 కులాల వరకు సంచార జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయనే అంచనా ఉంది.
ఈ కులాల్లో రామజోగి, మండెచ్చుల, బాగోతులు, రుంజా, పెక్కర, ఏదిలవారు, గౌడ జెట్టీలు, బొప్పల, సరగాని, సన్నాయిలు, బైల్ కమ్మరులు తదితరులు ఉన్నారు. బీసీ జాబితాలో ఉన్నప్పటికీ కొన్ని కులాల జనాభా అత్యంత తక్కువగా ఉంటుంది. వీరిలో అచ్చుకట్ల వాండ్లు, అరవ, అరెకటిక, ఆరే మరాఠా, గాండ్ల, బహురూపి, బుడబుక్కల, చిందువాళ్ళు, చిత్తరి, దాసరి, దేవాంగ, దొమ్మర, ఎడిగ, గంగిరెడ్ల, భజంత్రీ, జింగార్, జోగి, కాచి, వీరముష్టి, వంశరాజ్, గోత్రాల, పూసల, మందుల, నొక్కర, దమ్మలి , బాల సంత, బహురూపి, కాటిపాపల, పాముల, పర్ధి, దమ్మల, వీర ముష్టి, ఎల్లమ్మ వాండ్లు, ముత్యాల వాండ్లు, యాట, మందుల, కంజర, మొండివారు, జంగం వారు తదితరులు ఉన్నారు. ఈ కులాల్లో చాలామందికి స్థిర నివాసం లేదు. వారు కాలువల వెంట, చెరువుల పక్కన, ఊర్లకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. పట్టణాలలో రోడ్లకు ఇరువైపులా పుట్పాత్లపై జీవనం సాగిస్తున్నారు.
మన సంస్కృతికి మూలస్తంభాలు
వీరిలో కొందరు కట్టెలు కొట్టి అమ్మేవారు, కొందరు యాచక వృత్తిలో ఉన్నారు. మరికొందరు కథలు చెప్పేవారు, తాడుపై నడిచే విన్యాసకారులు, పాములను ఆడిస్తూ, తోలు బొమ్మలతో ఆటలు ఆడుతూ సమాజానికి వినోదం అందిస్తున్నారు. డప్పులు కొట్టుకుంటూ, కోతులతో ఆటలాడుతారు. అయితే, వీరి జీవితాల వెనుక ఉన్న కళలు, సంస్కృతి, జీవన మౌలికత – భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు. 1953లో ఏర్పాటు అయిన కాక కాలేకర్ కమిషన్ దేశవ్యాప్తంగా 2,399 బీసీ కులాలు గుర్తించి, వాటిలో 837 కులాలను అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీగా) పేర్కొంది. . ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ప్రత్యేకంగా ఎంబీసీ, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ జాబితా రూపొందించి, ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ సబ్ ప్లాన్ నిధులతో బీసీలకు సంక్షేమ పథకాలను రూపొందించడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది.
కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2023–-24లో రూ.6,432 కోట్లు కేటాయించింది. అయితే, రూ. 3089 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2024-–25లో రూ.9,200 కోట్లు కేటాయించి రూ. 2600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2025-–26లో రూ.11,405 కోట్లు కేటాయించి కేవలం 2294 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఎంబీసీల అభివృద్ధికి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, వారి అభివృద్ధికి కృషి చేస్తామన్న హామీ అమలు చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంబీసీ, సంచార జాతులకు తగిన ప్రాధాన్యత ఇచ్చి వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. తెలుగు ప్రజల సంస్కృతి, చరిత్రను తరతరాలుగా బతికించి పరిరక్షించిన వారిని పురాతన కళాకారులు, జానపద గాయకులు, జీవిత చరిత్రకారులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
- వై. శివ ముదిరాజ్,
హైదరాబాద్
సెంట్రల్ యూనివర్సిటీ