పంజాగుట్ట, వెలుగు: తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని, ఇక్కడి జర్నలిస్టులపై ఆంధ్ర పోలీసుల అజమాయిషీ ఏంటని పలువురు వక్తలు ప్రశ్నించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాఖ్య అధ్యక్షుడు కరుణాకర్ దేశాయి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, సినీ దర్శకుడు సయ్యద్ రఫీ, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కేవీఆర్ను ఆంధ్ర పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, తెలంగాణ నదులు, నిధులు, నియామకాలు మళ్లీ ఆంధ్ర పెత్తందారుల చేతుల్లోకి వెళ్లడం సిగ్గుచేటని ఆరోపించారు. వాస్తవాలను వెలికితీస్తున్న యూట్యూబర్లను అణచివేసేందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని, జర్నలిస్టులంతా ఏకమై ఆంధ్ర ప్రభుత్వ దుశ్చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్లె రవికుమార్, మామిడి సోమయ్య పాల్గొన్నారు.
