హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు ఇప్పట్లో అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా మరో రెండు నెలలు విరమణ వయసు పెంపు ఆలోచన ఉండకపోవచ్చని సమాచారం. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు పెంచాలని ప్రగతి భవన్ మీటింగ్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు రెండు, మూడు రోజల్లోనే ఫైల్ సిద్ధం చేసినా.. అది ప్రభుత్వం వద్ద ఆగిపోయినట్లు సమాచారం.
ఆర్టీసీలో ప్రతి నెలా సుమారు 100 మంది రిటైర్ అవుతుంటారు. డిసెంబర్ 31న 103 మంది, జనవరిలో మరో వంద మంది దాకా రిటైర్ కావల్సి ఉంది. అధికారిక ఉత్తర్వులు వస్తే ఉద్యోగులను మరో రెండేండ్ల పాటు కొనసాగించడానికి వీలుంటుందని, లేకపోతే ఏమీ చేయలేమని అధికారులు చెబుతున్నారు. దీంతో మరో రెండేండ్ల పాటు ఉద్యోగం చేసుకోవచ్చని ఆశపడిన ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు.