నాలుగు రోజుల్లో పెండ్లి.. పిల్ల నచ్చలేదని  పారిపోయిండు

నాలుగు రోజుల్లో పెండ్లి.. పిల్ల నచ్చలేదని  పారిపోయిండు

మెదక్ (టేక్మాల్), వెలుగు: నాలుగు రోజుల్లో  పెండ్లి ఉందనగా పెండ్లికొడుకు  ఇంట్లో నుంచి పారిపోయాడు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన  టేక్మాల్ కు  చెందిన కుమ్మరి రఘుపతికి సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కు చెందిన ఓ యువతితో పెండ్లి ఖాయమైంది. ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. ఈనెల 21న ముహూర్తం పెట్టుకున్నారు. అమ్మాయి తరపు వారు చుట్టాలకు పెండ్లి పత్రికలు పంచుతూ పెండ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14 వ తేదీ నుంచి తన కొడుకు కనబడడం లేదని,  బంధువుల ఇండ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదని పెండ్లి కొడుకు తండ్రి టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్​ చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెండ్లి కూతురు నచ్చలేదని  రఘుపతి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది.