
- కొహెడలోని నారాయణ కాలేజ్ క్యాంపస్లో ఘటన
- విద్యార్థి సంఘాల ఆందోళన
ఎల్బీనగర్, వెలుగు : కాలేజీ బయటకు వెళ్లేందుకు గోడ దూకుతుండగా కరెంట్ షాక్ కొట్టి ఓ ఇంటర్ స్టూడెంట్ చనిపోయాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన కర్రే విజయ్ కుమార్ కుటుంబం కొన్నేండ్ల కింద హైదరాబాద్కు వచ్చి వెస్ట్ మారేడుపల్లిలో నివాసముంటోంది. ఇతడి కొడుకు గిరీశ్కుమార్(16)ను ఈ నెల12వ తేదీన హయత్ నగర్ మండలం కొహెడలోని నారాయణ క్యాంపస్ కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు. అయితే, కిషోర్ తనకు కాలేజీలో చదువుకోవడం ఇష్టం లేదని
ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు నాలుగు రోజులుగా ఫోన్ చేసి అడుగుతున్నాడు. అయితే, వారు తాము కాలేజీకి వచ్చి మాట్లాడతామని నచ్చజెప్తున్నారు. ఇక కాలేజీలో ఉండనంటూ కిషోర్ గురువారం అర్ధరాత్రి 2 గంటలకు హాస్టల్ గోడ దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, పక్కన11 కేవీ కరెంట్ లైన్ తీగలకు చేయి తగలడంతో షాక్ కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. శుక్రవారం కిషోర్ కనిపించడం లేదని కాలేజీ మేనేజ్ మెంట్ అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి హయత్ నగర్ పోలీస్స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు వెళ్లి సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
హాస్టల్ గోడ అవతలి వైపు వెళ్లి చూడగా చనిపోయి ఉన్న కిషోర్ కనపించాడు. కరెంట్ షాక్తో చనిపోయాడని భావించి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మరోవైపు నారాయణ కాలేజీ మేనేజ్ మెంట్ ఒత్తిడి తట్టుకోలేక కిశోర్ చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. పోలీసులు వెళ్లి విద్యార్థి సంఘాల నేతలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
కరెంట్ షాక్తో కూలీ మృతి
- కుటుంబసభ్యుల ఆందోళన
మెదక్టౌన్, వెలుగు : మెదక్ లోని ఓ కాలేజీలో చెట్ల కొమ్మలు కొట్టడానికి వచ్చిన వ్యక్తి కరెంట్షాక్ తో చనిపోయాడు. సీఐ దిలీప్కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..బాలానగర్ తండాకు చెందిన బానోత్ఫకీరియా (38) శుక్రవారం మెదక్లోని మహిళా పాలిటెక్నిక్కాలేజీలో చెట్ల కొమ్మలు కొట్టడానికి వచ్చాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద పని చేస్తుండగా ఎర్త్ వైర్లు తగిలి షాక్ కొట్టి పడిపోయాడు.
జిల్లా దవాఖానకు తరలించగా చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బాలానగర్తండావాసులు కాలేజీపై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు బాధితులకు నచ్చజెప్పి పంపించారు.