- ప్రభుత్వానికి విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో సన్న బియ్యం పథకం ఒకటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పెద్దోళ్లతో సమానంగా పేదోళ్లు కూడా కడుపునిండా సన్న బియ్యం అన్నం తింటున్నారని చెప్పారు. అసెంబ్లీలో కూడా ఒకసారి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సన్న బియ్యంతో ప్రభుత్వం భోజనం పెట్టించాలని ఆయన కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రైతుల మద్దతు కాంగ్రెస్కే ఉందన్నారు. అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలిపోయిందన్నారు. అయితే, పాడికౌశిక్ రెడ్డి కల్పించుకుని మల్లన్నసాగర్, మల్కంపేట రిజర్వాయర్లు ఏ ప్రాజెక్టులో ఉన్నాయో చెప్పాలన్నారు. దానికి బదులిచ్చిన ఆది శ్రీనివాస్.. మల్కంపేటకు శంకుస్థాపన చేసింది శ్రీధర్ బాబు అని చెప్పారు. వైఎస్ హయాంలోనే దానికి అంకురార్పణ జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులూ ఇప్పటికీ సేవలందిస్తున్నాయని చెప్పారు.
కేసీఆర్ను సభకు రమ్మనండి: బాలూ నాయక్
గవర్నర్ ప్రసంగానికి రాని ఏకైక ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మిగిలిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీ లతో వచ్చి గవర్నర్ ప్రసంగంపై నిరసన వ్యక్తం చేశా రని, అదే వాళ్ల నాయకుడు అదే నల్లబ్యాడ్జీతో అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని మంగళవారం అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు రాకుండా కేసీఆర్ ఫాంహౌస్లో పడుకుంటున్నారని, అక్కడే ఉండిపోకుండా అసెంబ్లీకి రావాలని ఆ పార్టీ నేతలైనా చెప్పాలన్నారు. కేసీఆర్ ఇలాగే ఉంటే.. బీఆర్ఎస్కు భవిష్యత్ ఉండదన్నారు.
