ఎలక్ట్రిక్ బస్సులు నడిపేదెవరు?.. ఆర్టీసీ డ్రైవర్లా.. తయారీ సంస్థ ఉద్యోగులా?

ఎలక్ట్రిక్ బస్సులు నడిపేదెవరు?.. ఆర్టీసీ డ్రైవర్లా.. తయారీ సంస్థ ఉద్యోగులా?
  • ఎలక్ట్రిక్ బస్సులు నడిపేదెవరు?
  • రాష్ట్రానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామన్న కేంద్రం 
  • ఈ బస్సులను నడిపేది ఆర్టీసీ డ్రైవర్లా.. తయారీ సంస్థ ఉద్యోగులా?
  • రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్న యూనియన్లు
  • కేంద్రం నిబంధనల్లో సడలింపులు లేకపోవడంతో సర్కారుకు కొత్త చిక్కులు

హైదరాబాద్, వెలుగు:  ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకంలో భాగంగా హైదరాబాద్ కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వానికి సంతోషం కలిగించినా.. ఈ బస్సులను నడిపే విషయంలో కొత్త సమస్య ఎదురవుతోంది. కేంద్రం అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల పథకంలో ఆ బస్సులను జీసీసీ ( గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) పద్దతిలో తయారు చేసే కంపెనీలకు చెందిన డ్రైవర్లే నడుపుతారు. ఈ బస్సుల్లో ఆర్టీసీ సంస్థ నుంచి కేవలం కండక్టర్లు మాత్రమే ఉంటారు.

దీంతో ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ డ్రైవర్లు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని మొదటి నుంచీ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రాబోతుండడంతో వాటికి ఆర్టీసీ డ్రైవర్లను వినియోగించే అవకాశం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇందుకు ప్రణాళికలను రెడీ చేస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునివ్వడం, ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో డ్రైవర్ల ఉద్యోగ భద్రత కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం జేఏసీ నేతల డిమాండ్ కు సానుకూలంగానే స్పందించింది. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాల తొలగింపు ఉంటుందనే ఆందోళన ఎంతమాత్రం  అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చినట్లు యూనియన్ నేతలు  చెప్తున్నారు. ఈ క్రమంలో  కేంద్రం కేటాయించిన 2 వేల ఈ బస్సుల్లో సంస్థ డ్రైవర్లనే కొనసాగించాలని డిమాండ్​చేస్తున్నారు.

కాగా, కేంద్రం పాలసీలో అవసరమైన మార్పులు చేసి ఆర్టీసీ డ్రైవర్లే ఈ బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం యూనియన్లకు హామీ ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆ సంస్థ తరఫున ఉండే డ్రైవర్లే నడుపనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఇటు డ్రైవర్లలో అటు యూనియన్లలో కొనసాగుతున్నది.