
= నోటీసులివ్వడం కాదు సస్పెండ్ చేయాలంటున్న రాజాసింగ్
= అలా చేస్తే అందరి జాతకాలూ బయటపెడతానంటూ కామెంట్
= కమలం పార్టీలో ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ హీట్
= గోషామహల్ ఎమ్మెల్యే ధిక్కారం వెనుక మతలబేంటి?
హైదరాబాద్: రాజాసింగ్... బీజేపీలో ధిక్కార స్వరం.. లైన్లు దాటుతూ.. మనసులో మాట చెప్పేస్తారు.. అధినాయకత్వం నిర్ణయంపై బాణం ఎక్కుపెడుతుంటారు..? సందర్భమేదానా ఖుల్లం ఖుల్లా కుండ బద్దలు కొట్టేస్తారు. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంధించిన లేఖాస్త్రం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ లోనే పెను దుమారం రేపింది. బీఆర్ఎస్ ను అయోమయంలో పడేసింది.
ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశారు. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా కామెంట్లు చేశారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక్క సారిగా తేరుకున్న బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ లో నెలకొన్న సంక్షోభంపై ఎవరూ మాట్లాడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
అయినా రాజాసింగ్ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కొన్నాళ్లుగా బీజేపీలో అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. కవిత లేఖ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యల తర్వాత తనపై యుద్ధం మొదలైందని దొంగలంతా ఒక్కటయ్యారని రాజాసింగ్ ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచే తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్ధించినందుకే తనపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోందని మరో కామెంట్ చేయడం విశేషం.
అవసరం లేదంటే వెళ్లిపోతా
2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తన అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ సిద్ధమేనన్నారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదనీ అన్నారు. మరోసారి పాత సామాను బయటకు పోతేనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
సీక్రెట్ మీటింగ్స్ పెడుతున్నదెవరు?
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఇలా సీక్రెట్ మీటింగ్లు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నిఖార్సైన పార్టీ నేతలకే ఇవ్వాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ మీడియా ముఖంగా చెప్పడం పెను సంచలనంగా మారింది. దీంతో సీఎంతో రహస్యంగా భేటీ అవుతున్న బీజేపీ నేతలెవరనేది చర్చ జరిగింది. రాజాసింగ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది హాట్ టాపిక్ గా మారింది.
మరో సారి వేటు వేస్తారా?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చివరకు జాతీయ నాయకత్వం ఎంటరైంది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయన గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికయ్యారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంపికపైనా ఆయన కామెంట్స్ చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైనా ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనను సంప్రదించకుండా తన జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేశారని విమర్శలు చేశారు. పార్టీకి సేవ చేసిన వారికి పదవులు ఇవ్వకుండా తమకు ఇష్టమైన వారికే కట్టబెట్టుకున్నారంటూ పరోక్షంగా రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇవన్నీ పరిశీలిస్తున్న పార్టీ నాయకత్వం మరోసారి వేటు వేస్తుందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
అందరి జాతకాలు బయట పెడతా: రాజాసింగ్
తనను అధిష్ఠానం సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. తనకు నోటీసులు ఇవ్వాలని బీజేపీ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. నోటీసులు కాదు, కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానని, ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందుంచుతానని అన్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
ఆయన వెనుక ఎవరు?
కమలం పార్టీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న రాజాసింగ్ వెనుక ఎవరున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతున్న రాజాసింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జాతీయ నాయకత్వంతో ఆయనకు సన్నిహితులున్నారా..? రాష్ట్రానికి చెందిన కొందరు నేతల సపోర్ట్ తోనే రాజాసింగ్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.