
- దళిత ఎమ్మెల్యే అంటే చిన్నచూపా?
- సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు చేయరు
- రాష్ట్ర సర్కారుపై ఎమ్మెల్యే అనుచరులు, అభిమానుల ఆగ్రహం
- అంత్యక్రియలను ఆపి ఆందోళన.. ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటిక వద్ద హైటెన్షన్
- సమాధానం చెప్పలేక వెనక్కి మళ్లిన మంత్రులు తలసాని, మల్లారెడ్డి
హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: జి.సాయన్న.. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే.. పైగా అధికార పార్టీ నేత, దళిత లీడర్. ఒకవైపు ఆయన అకాల మరణంతో అనుచరులు, అభిమానులు బాధలో ఉండగా.. మరోవైపు ఆ నాయకుడి అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో సాయన్న అనుచరులు, అభిమానులు భగ్గుమన్నారు. రాష్ట్ర సర్కారు తీరును శ్మశానవాటిక వద్ద ఎండగట్టారు. సాయన్న భౌతికకాయాన్ని చితిపై ఉంచి.. ‘‘కేసీఆర్ డౌన్డౌన్.. బీఆర్ఎస్ డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. 30 ఏండ్లు ప్రజా సేవ చేసిన దళిత నాయకుడు, ఐదుసార్లు ఒకే స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే చనిపోతే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో ఎందుకు నిర్వహించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే వివక్ష చూపుతున్నారని సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు, ఆంధ్రావాళ్లు చనిపోయినప్పుడు అన్నీ దగ్గరుండి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించే ప్రభుత్వం.. సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పట్టించుకోకపోవడం ఏమిటని మండిపడ్డారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. అక్కడికి వచ్చిన మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డిని వారు నిలదీశారు. దీంతో మంత్రులు సమాధానం చెప్పలేక వెనక్కి వెళ్లిపోయారు. చివరికి అభిమానులకు సాయన్న కుటుంబసభ్యులు నచ్చజెప్పి.. అంత్యక్రియలు జరిపించారు.
శ్మశాన వాటిక వద్ద తీవ్ర ఉద్రిక్తత
కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.సాయన్న ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. సోమవారం ఉదయం ప్రజల సందర్శనార్థం అశోక్ నగర్లోని ఆయన నివాసం నుంచి కంటోన్మెంట్ లోని కార్ఖానాలో గలఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్కు భౌతికకాయాన్ని తరలించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అక్కడి నుంచి అంతిమయాత్ర ప్రారంభించారు. ఆయన భౌతికకాయాన్ని సాయంత్రం ఈస్ట్ మారేడ్పల్లిలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో సాయన్న అభిమానులు, అనుచరులు, దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ శ్మశాన వాటికలో బైఠాయించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి చనిపోతే ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ అక్కడికి వచ్చిన మంత్రులు తలసాని, మల్లారెడ్డిపై మండిపడ్డారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆదివారం సాయంత్రం ఎందుకు ప్రకటించావో సమాధానం చెప్పాలంటూ తలసానిని నిలదీశారు. ‘‘వివాద రహితుడు, అందరితో కలుపుగోలుగా ఉండే సాయన్నను దళితుడనే చిన్నచూపు చూస్తున్నరా? సినిమా వాళ్లు, ఆంధ్రా ప్రాంతం వాళ్లు ఇక్కడ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే ప్రభుత్వం సాయన్న విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నది.
కేసీఆర్ దళిత ద్రోహి.. దళిత వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసిండు. మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిండు. ఇప్పుడు దళిత ఎమ్మెల్యే చనిపోతే కూడా వివక్ష చూపుతున్నడు” అంటూ మండిపడ్డారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. తాము అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ప్రయత్నించామని, కానీ కొన్ని కారణాలతో సాధ్య పడలేదని మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ససేమిరా అనడంతో మంత్రులు తలసాని, మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోళన విరమించకపోవడంతో సాయన్న అనుచరులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాగంటి గోపీనాథ్ జోక్యం చేసుకొని.. సాయన్న కుటుంబ సభ్యులతో చర్చించారు.
రాత్రి అవుతుండటంతో అనుచరులను, అభిమానులను సాయన్న కుటుంబ సభ్యులు సముదాయించి అంత్యక్రియలు జరిపించారు. రాత్రి 7.50 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, సోమవారం ఉదయం మండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి అశోక్నగర్లోని సాయన్న నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్వెంకటస్వామి తదితరులు సాయన్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.