ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమా?

ఒక్కో అధికారికి ఒక్కో న్యాయమా?

హైదరాబాద్, వెలుగు: సీఎస్ సోమేశ్ కుమార్, ఇన్​చార్జి డీజీపీ అంజనీకుమార్ సహా 13 మంది ఐఏఎస్, ఐపీఎస్​ల కేటాయింపుల వివాదాలపై సమాధానం చెప్పాలని, వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపులపై గతంలో క్యాట్​ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న కేంద్రం పిటిషన్లపై బుధవారం చీఫ్​ జస్టిస్​ సతీశ్​ చంద్ర నేతృత్వంలోని హైకోర్టు బెంచ్​ విచారించింది. చిత్తూరు అదనపు ఎస్పీ అభిషేక్ మహంతికి పోస్టింగ్​ ఇచ్చే విషయంలో ఒక్కో అధికారి ఒక్కో న్యాయమేంటని ప్రశ్నించింది. అయితే, మిగతా పిటిషన్లు జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్​ బెంచ్​ వద్ద పెండింగ్​లో ఉన్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్​ జనరల్​ సూర్యకిరణ్​రెడ్డి సీజే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభిషేక్​ మహంతి కేటాయింపు వివాదంపై కేంద్రం వేసిన పిటిషన్​నూ జస్టిస్​ భూయాన్​ బెంచ్​కే సీజే పంపించారు. ఆ పిటిషన్​ను పరిశీలించిన బెంచ్​.. అభిషేక్ మహంతితో పాటు ఐఏఎస్​ల కేటాయింపులపై కౌంటర్లు వేయాలని సర్కార్​ను ఆదేశించి, విచారణను మార్చి 24కి వాయిదా వేసింది.