న్యూఢిల్లీ: కొన్ని దేశాల్లో మూసివేత ఆంక్షల్లో సడలింపులు ఇచ్చారు.. మరికొన్ని దేశాల్లో ఔట్డోర్ ట్రెయినింగ్ కూడా మొదలైంది.. ఇంకా ఓ అడుగు ముందుకేస్తూ ఆస్ట్రేలియాలో స్పోర్టింగ్ ఈవెంట్స్కు, కాన్సర్ట్స్కు 25 శాతం మందిని అనుమతించారు. ఇలా చేయడం చాలా గొప్ప పరిణామని టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదన్నాడు. ‘క్రౌడ్తో కూడిన స్టేడియంలో మ్యాచ్ ఆడితే వచ్చే కిక్కే వేరు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడటం ద్వారా ఎనర్జీ మిస్ అవుతాం. ప్లేయర్లకు ఇది మైనస్ పాయింట్. గ్రౌండ్లో ఫ్యాన్స్ క్రియేట్ చేసే ఎనర్జీ ఏం చేసినా రాదు. కాబట్టి కనీసం 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించినా బాగుంటుంది. ఈ విషయంలో ఆసీస్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది’ అని సచిన్ పేర్కొన్నాడు. స్టేడియాల్లోకి ఫ్యాన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్కప్ ఉంటుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మాస్టర్ భిన్నంగా స్పందించాడు. మెగా ఈవెంట్ను నిర్వహించగలమో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించుకోవాలన్నాడు. దీనిపై వెంటనే నిర్ణయానికి రావడం కూడా కొద్దిగా కష్టమేనని చెప్పాడు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ద్వారా క్రికెట్ రీస్టార్ట్ అవుతుండటం చాలా ఆనందాన్నిస్తోందన్నాడు.
బౌలింగ్ మెషీన్స్ పెడతారేమో..!
సలైవా బ్యాన్పై సచిన్ మాట్లాడుతూ.. ‘ఇంకొన్ని రోజులు పోతే బౌలర్ల ప్లేస్లో రెండు ఎండ్స్లో బౌలింగ్ మెషీన్స్ చూస్తాం అనుకుంటా. వాటితో బ్యాట్స్మన్కు కావాల్సినట్టు బాల్స్ వేయవచ్చు. క్రికెట్ అలా మారిపోతుందేమోనని నా ఫ్రెండ్స్ (బౌలర్లు) కొందరు అన్న మాటలివి. ఆట కచ్చితంగా మారబోతుంది అనేది నిజం. సలైవా వాడడాన్ని ఐసీసీ బ్యాన్ చేసింది. దీంతో మిడిల్ ఓవర్స్లో ఓ బౌలర్ బాల్ను ఎలా స్వింగ్ చేస్తాడు ? చెమట వాడమని అంటున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో ప్లేయర్లకు చెమట పట్టదు. అలాంటప్పుడు బాల్ను ఎలా షైన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల కోసమైనా ఓ మైనం బాక్స్ను అంపైర్స్కు ఇవ్వాలి. అది ఎంత ఇవ్వాలో, ఎలా వాడాలో అన్నింటిని ఐసీసీనే తేల్చాలి. ఇన్నింగ్స్కు ఇన్నిసార్లు అని కోటా పెట్టాలి. అలా కాదనుకుంటే 45–50 ఓవర్ల తర్వాత బాల్ను కచ్చితంగా మార్చాలి. కానీ సలైవా బ్యాన్ అనేది బౌలర్లకు వందశాతం ఎదురుదెబ్బే. అయితే టెస్ట్లకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేస్తే బౌలర్లకు కాస్త ఉపశమనం కలుగుతుంది. బౌలింగ్ పిచ్లు అయితే ఒక్క బాల్ సరిపోతుంది. లేదంటే బాల్ను మార్చాల్సిందే. బాల్ మార్పు విషయంలో అపోజిట్ టీమ్ అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాలి’ అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.
గుమ్మం దాటలేదు..
ఇంటి నుంచి బయటకు రాక మూడు నెలలు దాటింది. మార్చి 15 నుంచి బయటి వారిని కలవలేదు. హెల్త్ మినిస్ట్రీ సూచనలను పాటిస్తున్నా. 2020 ఇలా ఉంటుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ప్రపంచం మొత్తం మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో డిసెంబర్ 31న అందరూ పండగ చేసుకున్నారు. ఆ తర్వాత అలాంటి సందర్భం మళ్లీ రాలేదు. ఇంట్లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటించాలని మా ఫ్యామిలీ అంతా అనుకున్నాం. ఇంటి పట్టునే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా వంట చేశాను, రెండుసార్లు నా హెయిర్ కట్ చేసుకున్నా. ఓసారి అర్జున్ హెయిర్ కూడా కట్ చేశా. ఇక ఐపీఎల్ జరగడం అనేది దేశ ప్రజలపైనే ఆధారపడి ఉంది. దేశ పౌరులుగా ప్రతి ఒక్కరు బాధ్యతగా గవర్నమెంట్ సూచనలు పాటిస్తే లీగ్ జరిగే అవకాశాలు పెరుగుతాయి. కానీ చాలా మంది రూల్స్ పాటించడం లేదు. కొందరు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అందువల్ల రోజురోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే చాలా ఎంజాయ్మెంట్ దక్కుతుందనేది నిజం.