ఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు

ఏప్రిల్ చివరికల్లా..అందరికీ రైతుబంధు

ఖమ్మం, వెలుగు  :  రాష్ట్రంలో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందించామని, మిగిలిన వారికి ఈ నెలాఖరు లోపు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరి ధాన్యం కింటాల్​కు రూ.500 బోనస్​ను వచ్చే సీజన్ నుంచి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సోమవారం ఖమ్మం సరిహద్దుకు సమీపంలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం దగ్గరున్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని తుమ్మల దర్శించుకొని మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 69 లక్షల మంది రైతులకు చెందిన 1,11,49,574 ఎకరాలకు గాను రూ.5,574.77 కోట్ల రైతుబంధు ఇచ్చామని వివరించారు. రైతు బంధు సీలింగ్​పై అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో 35 లక్షల ఎకరాలకు సాగు చేయకున్నా రైతుబంధు డబ్బులిచ్చారని తెలిపారు. వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి పంట వేసిన రైతుకే పెట్టుబడి సాయం అందించే ఆలోచన చేస్తున్నామని అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని వివరించారు. ఒకేసారి రుణమాఫీ చేసేందుకు అవసరమైన విధివిధానాలపై చర్చిస్తున్నామని చెప్పారు. 

ఆగస్ట్ 15 నాటికి సీతారామ జలాలు 

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఆగస్టు 15కల్లా కనీసం లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు అందిస్తామని తుమ్మల చెప్పారు. ఇటీవల శంకుస్థాపన చేసిన వైరా లింక్​ కెనాల్​కు అవసరమైన భూసేకరణపై చర్యలు తీసుకుంటున్నామని, 3 నెలల్లోగా పనులు కంప్లీట్ చేసి నీళ్లిచ్చేలా ప్లాన్​ చేస్తున్నామన్నారు. సాగర్​ ఆయకట్టు స్థిరీకరణ, వైరా రిజర్వాయర్ ఆయకట్టు, లంకాసాగర్​ ఆయకట్టుతో పాటు 8 చిన్న లిఫ్ట్ ల కింద భూములకు ముందుగా నీరందిస్తామన్నారు.

సాగర్ జలాల విడుదలపై సీఎస్​కు ఫోన్​ 

ఖమ్మం జిల్లాకు తాగునీటి కోసం సాగర్ జలాలు వెంటనే విడుదల చేయాలని సీఎస్​ శాంతికుమారిని మంత్రి తుమ్మల కోరారు. పాలేరు రిజర్వాయర్​లో ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరు ఉన్నాయని, వెంటనే విడుదల చేసినా నీళ్లు పాలేరుకు చేరుకోవడానికి రెండ్రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. కేవలం తాగునీటి కోసమే నీళ్లివ్వాలని, కాలువల్లో రైతులు వ్యవసాయ మోటార్లు వేయకుండా, తూముల ద్వారా నీటిని తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆఫీసర్లకు ఆదేశాలిచ్చినట్టు ఆయన తెలిపారు.