చలికాలంలో వెచ్చవెచ్చగా ఉండటమే కాదు.. నోటికి కరకరమని తగలాలి కూడా.. అలాగే కారం కారంగా ఉండాలి కూడా. అలాంటి వంటకాలనగానే కరకరమనే మురుకులు పంటి కింద నలిగినట్టే అనిపిస్తుంది. వాటిలో కొన్ని వెరైటీలు ఇవి.. చేసుకుని కరకరా నమిలితే ఎంతో హాయిగా ఉంటుంది.. చలికాలంలో స్పెషల్ అనుభూతిని కలిగించే మురుకులను .. సింపుల్గా టేస్టీగా ఉండేందుకు ఏ పిండిని వాడాలి.. ఏఏ పదార్ధాలు కావాలి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
గోధుమపిండితో మురుకులు తయారీకి కావలసినవి
- గోధుమ పిండి: 1కప్పు
- జీలకర్ర: 1 టీస్పూన్
- ఇంగువ: చిటికెడు
- కారం:1 టీస్పూన్ (మీకు కావలసినంత)
- నువ్వులు: 2 టీస్పూన్లు
- ఉప్పు: తగినంత
- వెన్న : 1 టీస్పూన్
- వేడి నూనె: 2 టేబుల్ స్పూన్లు
- వేడి నీళ్లు: పిండి కలపడానికి తగినంత
తయారీ విధానం: ఒక స్టీల్ జల్లెడ తీసుకొని దానిపై ఒక శుభ్రమైన బట్ట వేయాలి గోధుమ పిండి వేయాలి. కుక్కర్లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కొంచెం వేడయ్యాక పిండి ఉన్న జల్లెడను పెట్టాలి. 20నిమిషాల ఆవిరిలో గోధుమ పిండిని ఉడికించాలి. తరువాత కుక్కర్లో నుంచి పిండిని తీసుకొని చల్లారిన తరువాత ఉండలు వుంటే చేతితో పొడి చేయాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఆవిరిపట్టిన గోధుమ పిండి, జీలకర్ర, ఇంగువ, కారం, సువ్వులు, ఉప్పు, వెన్న వేసి ఉండలు లేకుండా కలపాలి.
కొంచెం నీళ్లు పోసుకుంటూ మురుకల పిండిలా కలపాలి. పైనుంచి కొంచెం వేడి నూనె వేసి ముద్దలా చేయాలి. పొయ్యి మీద బాండీ పెట్టి మురుకులు వేగించాడినికి సరిపడి నంత నూనె వేసి వేడి చేయాలి. తరువాత మురుకులు పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా చేయాలి. గిద్దెలను తీసుకొని అందులో పిండిని పెట్టి ఒక పేపర్ మీద మురుకుల్లా గుండ్రంగా పత్తాలి. వేడి నూనెలో వేసి సన్నని మంట మీద ఉంచి రెండు వైపులా కాల్చాలి. . . ఇక అంతే కర కర మని నమిలితే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది మరి..!
మైదా పిండితో తయారీకి కావలసినవి ఇవే..!
- మైదాపిండి: 500 గ్రాములు
- పెసరపప్పు :2 టేబుల్ స్పూన్స్
- మినపప్పు :1టేబుల్ స్పూన్
- శెనగలు : 1టేబుల్ స్పూన్
- నువ్వులు : 2 టేబుల్ స్పూన్స్
- కారం: 1 టీస్పూన్( మీకు కావలసినంత)
- ఉప్పు: తగినంత
- వేడి నూనె: 2టేబుల్ స్పూన్స్
- వేడి నీళ్లు: పిండి కలపడానికి తగినంత
తయారీ విధానం : ఒక స్టీల్ జల్లెడ తీసుకొని దానిపై ఒక శుభ్రమైన క్లాత్ వేయాలి దానిమీద మైదా పిండి చేయాలి. కుక్కర్ లో కొన్ని నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి కొంచెం వేడయ్యాక పిండి ఉన్న జల్లెడను పెట్టాలి. 20నిమిషాల తరువాత ఒక సారి చూడాలి. నీళ్లు తగ్గినట్లయితే మళ్లీ కొంచెం నీళ్లు వేసి సన్నని మంటమీద ఆవిరి పట్టాలి. ఇలా మొత్తం 40నిమిషాలు ఆవిరిలో మైదా పిండిని ఉడికించాలి. తరువాత ఉండలు వుంటే చేతులతో పొడి చేయాలి.
ఒక మిక్సి గిన్నె తీసుకొని అందులో మినపప్పు, పెసరపప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆవిరిపట్టిన మైదా పిండి మినపప్పు, పెసరపప్పు పొడి, నవ్వులు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. వేడి నీళ్లతో మురుకుల పిండిలా కలుపుకోవాలి. దానిపై కొంచెం గోరు వెచ్చని నూనెను వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి.
పొయ్యి మీద బాండ్ పెట్టి మురుకులు వేగించడానికి సరి పడినంత నూనె పోయాలి. నూనె వేడయ్యాక మురుకుల పిండిని తీసుకొని పెద్ద ముద్దలుగా చేసుకొని మురుకులు గిద్దలో పిండి పెట్టి ఒక పేపర్ మీద చిన్న చిన్న మురుకుల్లా గుండ్రంగా వత్తాలి. నూనెలో వేసి సన్నని మంట మీద ఉంచి రెండు వైపులా కాల్చాలి. ఇలా చేసిన మురుకుల తింటే రుచి అదిరిపోవాల్సిందే గా మరి..! చలికాలంలో ఇలాంటి మురుకులను కరకర మని సౌండ్ చేస్తూ లొట్టలేస్తూ తిని ఎంజాయి చేయండి మరి..!
వెలుగు,లైఫ్
