ఎంపీ టికెట్‌‌‌‌ కోసం..ప్రయత్నాలు షురూ

ఎంపీ టికెట్‌‌‌‌ కోసం..ప్రయత్నాలు షురూ
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌‌‌‌ విజయం
  •     వరంగల్ లోక్‌‌‌‌సభ టికెట్‌‌‌‌పై పలువురి ఫోకస్
  •     ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్లతో పాటు కొత్త నేతల ప్రయత్నాలు
  •     హైకమాండ్‌‌‌‌ను, నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో లీడర్లు

హనుమకొండ, వెలుగు : సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌‌‌‌ భారీ విజయంతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో 10 స్థానాలు హస్తం పార్టీ చేజిక్కించుకోవడంతో నేతలంతా ఖుషీగా ఉన్నారు. ఇదే ఊపు పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్న ఉద్దేశంతో కొందరు నేతలు ఇప్పటినుంచే ఎంపీ టికెట్‌‌‌‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నేతలతో పాటు మరికొందరు సీనియర్లు, కొత్త నేతలు కూడా టికెట్‌‌‌‌ ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరికొందరైతే మరింత ముందుకు వెళ్లి తానే ఎంపీ అభ్యర్థినంటూ సోషల్​మీడియాలో గ్రూపులు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. 

గెలుపు ఈజీ అవుతుందనే ఉద్దేశంతో...

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని స్థానాల్లో అనూహ్య విజయం సాధించింది. మొత్తంగా 10 స్థానాల్లో గెలిచి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను కేవలం రెండు స్థానాలకే పరిమితం చేసింది.

2018 ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ 10 స్థానాల్లో నెగ్గి, కాంగ్రెస్‌‌‌‌ను 2 స్థానాలకే పరిమితం చేయగా ఇప్పుడు సీన్‌‌‌‌ రివర్స్‌‌‌‌ అయింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌‌‌ గెలువని నియోజకవర్గాల్లో కూడా అనూహ్యంగా విజయం సాధించడంతో కాంగ్రెస్​శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఉండడంతో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో కొందరు లీడర్లు లోక్‌‌‌‌సభ బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ALSO READ: తెలంగాణ నూతన కేబినెట్​లో మిగిలిన 6 బెర్తుల్లో..ఎవరికి చాన్స్​?

ఎమ్మెల్యే టికెట్‌‌‌‌ దక్కనోళ్లు ఎంపీకి ప్రయత్నం

వరంగల్‌‌‌‌ లోక్‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలో వరంగల్‌‌‌‌ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తి, స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, భూపాలపల్లి సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంపీగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన పసునూరి దయాకర్‌‌‌‌ కొనసాగుతుండగా ఆయన పదవీకాలం 2024 మేతో ముగియనుంది. దీంతో మరో ఆరు నెలల్లో ఎంపీ ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలతో పాటు ఇదివరకు లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన లీడర్లు కూడా ఇప్పుడు బరిలో నిలిచేందుకు ఇంట్రస్ట్‌‌‌‌ చూపుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా వరంగల్‌‌‌‌ లోక్‌‌‌‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలంతా కలిపి సుమారు 69 మంది ఉన్నారు. అసెంబ్లీ టికెట్ దక్కని వాళ్లలో కొందరు ఎంపీ బరిలో నిలిచే ఉత్సాహంతో ఉన్నారు. ఈ మేరకు ముందస్తు వ్యూహంతో పార్టీ ముఖ్యులు, తమ గాడ్‌‌‌‌ఫాదర్లను ప్రసన్నం చేసుకునే  పనిలో పడ్డారు. అలాగే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌‌‌‌గాంధీతో పాటు ఇతర నేతలకు టచ్‌‌‌‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ..

ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. కొందరేమో హైకమాండ్‌‌‌‌ పెద్దలకు దగ్గరగా ఉంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. ఇంకొందరు ఓ వైపు టికెట్ ఆశిస్తూనే మరో వైపు తమ అనుచరులకు ఇండికేషన్స్‌‌‌‌ ఇస్తున్నారు. అంతేగాకుండా ఎంపీ ఆస్పిరెంట్స్‌‌‌‌ పేరుతో వాట్సప్‌‌‌‌ గ్రూపులు క్రియేట్‌‌‌‌ చేసి జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.  గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 

పోటీకి సీనియర్లు తహతహ

వరంగల్‌‌‌‌ లోక్‌‌‌‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఒక్క స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ కడియం శ్రీహరి గెలువగా, మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్లే విజయం సాధించారు. ఎంపీ ఎన్నికల్లో కూడా గెలుపు ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో వరంగల్‌‌‌‌ ఎంపీ స్థానానికి ఆశావహులు ఎక్కువ అవుతున్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన సిరిసిల్ల రాజయ్య ఇటీవల వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్‌‌‌‌ ఆశించినా నిరాశే ఎదురైంది.

దీంతో ఆయనతో పాటు పార్టీ సీనియర్‌‌‌‌ నేత గతంలో ఓటమి చవి చూసిన దొమ్మాటి సాంబయ్య సైతం ఎంపీగా బరిలో నిలిచేందుకు ఆసక్తితో ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్‌‌‌‌ ఎస్సీ సెల్‌‌‌‌ జిల్లా చైర్మన్‌‌‌‌ రామకృష్ణతో పాటు గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మరో మహిళా నేత భారతి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ మహిళా నేత కూడా ఎంపీ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా ఎంపీ సీటు కోసం కొందరు ఇప్పటికే పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వరంగల్‌‌‌‌ ఎంపీ స్థానానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో నేత కూడా గురి పెట్టినట్లు తెలిసింది. టీడీపీ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ నుంచి ఆయన ఇప్పటికే బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీలు మారి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. పాత టీడీపీ వర్గం కావడం, పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌తోనూ టచ్‌‌‌‌లో ఉంటున్నట్లు తెలిసింది.